Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

విద్య ప్రాథమిక అంశంగా పటిష్ట చర్యలు….రాష్ట్ర వ్యవసాయమంత్రి తుమ్మల

విద్య ప్రాధాన్యత అంశంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తుందని, పేద ప్రజలకు ప్రపంచంతో పోటీపడే విద్య అందే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

శుక్రవారం మంత్రి, రఘునాథపాలెం మండలం జింకలతండా వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనులకు, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, సమాజానికి కావలసిన అత్యంత ప్రాధాన్యత అంశం విద్య అని, ముఖ్యమంత్రి పదవిలో వచ్చిన దగ్గర నుంచి గత 20, 30 సంవత్సరాలుగా  ప్రభుత్వాలు విద్యపై ఆశించిన స్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని ఆలోచించి, ప్రపంచంతో పోటీ పడే విధంగా  నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు విద్యాబోధన అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

మానవజాతి పురోగతికి అవసరమైన విద్య, వైద్యం పకడ్బందీగా ఉండటం చాలా అవసరమని, దీనిని గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని అన్నారు. అభివృద్ధి పరంగా మన దేశం కంటే చాలా దేశాలు ముందు ఉన్నాయని, వాటితో పోటీ పడాలంటే మన విద్యార్థులకు మంచి శిక్షణ కావాలని, అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల రూపకల్పన చేశామని అన్నారు.

గతంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో అరకొర వసతులతో పిల్లలు ఇబ్బంది పడ్డారని, ఆ పరిస్థితి మరోసారి రావద్దని ఒక్కొక్క పాఠశాలకు 300 నుంచి 350 కోట్లు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కు సూచించారు.

మంచి భారతదేశ పౌరులు ఎలా ఉండాలని చాటే విధంగా తయారు చేసే స్వామి నారాయణ ట్రస్ట్ కంటే మిన్నగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలను తయారు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా రఘునాథ పాలెం మండలాన్ని తీర్చిదిద్దుతున్నామని మంత్రి అన్నారు.  మండలంలో ప్రభుత్వ భూములు మార్క్ చేసి పెట్టుకోవాలని, ఇస్కాన్ పాఠశాల, కిచెన్, కృష్ణ దేవాలయం  ఏర్పాటు అవుతాయని మంత్రి కలెక్టర్ కు తెలిపారు.

స్వామి నారాయణ, సమీకృత విద్యాలయాలు, మెడికల్ కాలేజీలు రఘునాధపాలెం మండలంలో ఏర్పాటు అయ్యాయని, ఇస్కాన్ సంస్థ కూడా ఈ మండలానికి వచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.   

మన పిల్లలు చిన్న వయసులోనే గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు అవుతున్నారని, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలను కనిపెట్టుకొని ఉండాలని అన్నారు.  డ్రగ్స్, గంజాయిపై మరింత దృష్టి పెట్టాలని, వీటిని ఉక్కుపాదంతో అణిచివేయాలని అన్నారు.

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన పిల్లలు భవిష్యత్తు కోసం 5 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. బుగ్గ వాగు నీళ్ళ ఈ మండలానికి తేవడానికి కాలువల కొరకు భూములు ఇస్తే తీసుకొని వస్తానని, లేని పక్షంలో సాగర్ లిఫ్ట్ ద్వారా ఈ మండలానికి నీళ్ళు తెస్తానని అన్నారు.  మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు.

వైద్య కళాశాలలో భూమి కోల్పోయిన రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి పూర్తిగా ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో 3 పంటలు పండే ప్రాంతంగా రఘునాథపాలెం ఎదగాలని అన్నారు. మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ క్రింద 18 వేల కోట్లు రుణ మాఫీ చేశామని మంత్రి తెలిపారు. 2 లక్షల పైన ఉన్న రుణాలు ఉన్న  రైతులకు షెడ్యూల్ ప్రకటించి రుణమాఫీ పూర్తి చేస్తామని అన్నారు.

సన్నాలు పండించే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించామని అన్నారు. రైతుల పంటలకు కూడా పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. రుణమాఫీ పథకం తర్వాత రైతు భరోసా పథకం అమలు అవుతుందని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, జిల్లాకు, రాష్ట్రానికి ఈ రోజు చారిత్రాత్మక రోజు అవుతుందని,   అనేక ప్రాంతాలలో ప్రజలకు అనేక ఆకాంక్షలు ఉంటాయని, కానీ ప్రతి ఒక్కరికి తమ పిల్లలకు మంచి విద్య  నాణ్యమైన విద్య అందాలని ఆశిస్తారని, అది అందించేందుకు ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలు దోహద పడతాయని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు కలిపి నాణ్యమైన విద్య అందించేందుకు అద్భుతమైన మౌళిక వసతులు, క్రీడా వసతులు, మంచి పౌష్టికాహారం అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. మంత్రి ఆదేశాల మేరకు సంవత్సర కాలంలో సివిల్ పనులు నాణ్యతతో పూర్తిచేసి విద్యార్థులకు వేగవంతంగా అందుబాటులోకి తీసుకొని వస్తామని అన్నారు. 

కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ,   ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల ద్వారా అన్ని కులాలు, మతాల వారు కలిసి ఒకేచోట చదువుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.  దీని వల్ల అందరూ సామరస్యంగా బాగా చదివే అవకాశం ఉందని, దీని వల్ల ప్రతి వర్గానికి లాభం చేకూరుతుందని, సమీకృత రెసిడెన్షియల్ విద్యాసంస్థలు నిర్మిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, నగర కార్పొరేటర్ కమర్తపు మురళి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు దీక్ష పూనాలి …జిల్లా కలెక్టర్ మూజమ్మిల్ ఖాన్

Ram Narayana

అధికారుల నిర్లక్ష్యణ భారీ నష్టానికి కారణం…సిసిఐ నేత భాగం హేమంతరావు

Ram Narayana

పార్లమెంటు ఎన్నికల్లో మన సత్తా చూపిద్దాం..ఎంపీ నామ నాగేశ్వరరావు

Ram Narayana

Leave a Comment