—
పందెంలో గెలవాలంటే ఎంతో శ్రమించాలి, గాయాలను లెక్కచేయకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడాలి.. కానీ ఆ కోడి మాత్రం అవేవీ చేయనేలేదు. మిగతా కోళ్లు ఫైట్ చేస్తుంటే చూస్తూ నిలుచుంది అంతే. అంతిమంగా గెలుపు దానినే వరించింది. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో జరిగిన కోడి పందాల్లో ఈ వింత చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భీమవరంలో జరిగిన కోడి పందాల్లో నిర్వాహకులు ఐదు కోళ్లను బరిలోకి దింపారు. వాటిలో అవి పోరాడుకుని చివరికి మిగిలిన కోడి విజేతగా నిలుస్తుంది. కోళ్ల యజమానులతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా జోరుగా పందాలు కట్టారు. ఐదు కోళ్లలో మొదట రెండు కోళ్లు ఫైటింగ్ మొదలు పెట్టాయి. వాటిపైకి మరో కోడి పుంజు వచ్చి చేరింది. మూడింట్లో రెండు పుంజులు గాయపడి బరిలో నుంచి బయటకు వచ్చాయి. ఆ రెండు పుంజులను ఓడించిన పుంజు బరిలో ఉన్న మరో కోడిపైకి వెళ్లింది.
శక్తికొద్దీ పోరాడింది, ఎదుటి పుంజును గాయపరించింది. దీంతో ఆ పుంజు కిందపడింది. అదే సమయంలో దానిని ఓడించిన పుంజు కూడా గాయపడి కిందపడిపోయింది. ఓవైపు మిగతా నాలుగు పుంజులు పోరాడుతుంటే ఐదో పుంజు మాత్రం తనకేమీ పట్టనట్టు బరిలో నిలుచుంది. కడవరకూ అలాగే నిలుచుని చూస్తూనే ఉంది. మిగతా నాలుగు పుంజులు పడిపోవడంతో రూల్ ప్రకారం.. చివరి వరకు నిలబడి ఉన్న ఆ పుంజునే నిర్వాహకులు విజేతగా ప్రకటించారు.