- న్యూజిలాండ్ శిశు సంక్షేమ సంస్థకు భారత దంపతుల కుచ్చు టోపీ
- భార్య నేహా శర్మకు మూడేళ్ల జైలు, భర్త అమన్దీప్కూ శిక్ష
- నకిలీ పత్రాలతో ఉద్యోగం, భర్త కంపెనీకి అక్రమంగా పనులు
- అధికారులు పసిగట్టడంతో చెన్నైకి పలాయనం, అయినా దొరికి పోయిన వైనం
న్యూజిలాండ్లో భారత సంతతికి చెందిన నేహా శర్మ, అమన్దీప్ శర్మ అనే దంపతులు అక్కడి ప్రభుత్వ శిశు సంక్షేమ సంస్థ ‘ఒరంగ తమరికీ’కి భారీగా కుచ్చుటోపీ పెట్టారు. సుమారు 2 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.10 కోట్లకు పైగా) మోసం చేసినట్లు వీరిపై ఆరోపణలు రుజువయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నేహా శర్మకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. మోసం ద్వారా ఆర్థిక లబ్ధి పొందడం, మనీలాండరింగ్, నకిలీ పత్రాల వినియోగం వంటి పలు అభియోగాలను ఆమె అంగీకరించారు. ఆమె భర్త అమన్దీప్ శర్మ కూడా మోసం, మనీలాండరింగ్ ఆరోపణలను అంగీకరించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే, నేహా శర్మ ‘ఒరంగ తమరికీ’ సంస్థలో ప్రాపర్టీ అండ్ ఫెసిలిటీస్ మేనేజర్గా పని చేసే వారు. ఆమె భర్త అమన్దీప్ ‘డివైన్ కనెక్షన్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను నడిపే వారు. నేహా శర్మ నకిలీ ఉద్యోగ ధృవ పత్రాలను సమర్పించి 2021లో ఈ సంస్థలో చేరారు. తన అధికారిక హోదాను అడ్డు పెట్టుకుని, భర్త కంపెనీకి అక్రమంగా కాంట్రాక్టులు కట్ట బెట్టారు. 2021 జూలై నుంచి 2022 అక్టోబరు మధ్య కాలంలో, సుమారు 200కు పైగా నిర్వహణ పనులను, 326 పెంచిన ధరలతో కూడిన ఇన్వాయిస్లను భర్త కంపెనీకి మళ్లించారు. తామిద్దరూ భార్యా భర్తలమన్న విషయాన్ని సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకు రాకుండా ప్రయోజనాల వైరుధ్యం నిబంధనలను ఉల్లంఘించారు. 2022 అక్టోబరులో ఒకే కాంట్రాక్టర్కు పదేపదే పనులు అప్పగించడంపై అనుమానం రావడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విచారణకు హాజరు కావాల్సి ఉండగా, దంపతులిద్దరూ వ్యాపార తరగతి విమానంలో చెన్నైకి పారిపోయారు. అయితే, కొద్దికాలంలోనే వారిని పట్టుకుని న్యూజిలాండ్కు రప్పించారు. వారి వద్ద మూడు ఆస్తులు, మూడు కార్లు, బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ‘ఒరంగ తమరికీ’ సంస్థ ప్రకటించింది.