జాతీయ వార్తలు

 ఇండియా కూటమి చెక్కుచెదరదు, వెళ్లేవాళ్లు వెళ్లొచ్చు : అఖిలేశ్ యాదవ్

ఇండియా కూటమి పటిష్టంగా ఉందన్న అఖిలేశ్
కూటమిలో ఉంటూ బలహీనపరిచే మాటలు వద్దని హితవు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటుతుందని ధీమా

ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఐక్యత లేదని, కూటమి పని అయిపోయిందంటూ వస్తున్న ఊహాగానాలపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఇండియా కూటమి చాలా బలంగా ఉందని, చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి నుంచి ఎవరైనా బయటకు వెళ్లాలనుకుంటే స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని, వారిని ఎవరూ ఆపబోరని అన్నారు. అయితే, కూటమిలో కొనసాగుతూ దాన్ని బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ మధ్యాహ్నం లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కచ్చితంగా తన సత్తా చాటుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలిసికట్టుగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. మహాకుంభమేళాలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఇప్పటివరకు మృతుల పేర్లను ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదని ఆరోపించారు. 

Related posts

దేశీయ 5జీ నెట్ వర్క్ పరీక్షించేందుకు మద్రాస్ ఐఐటీకి అనుమతి!

Ram Narayana

అక్కడ మూడో భాషగా దేనిని నేర్పుతారు?: స్టాలిన్ ప్రశ్న!

Ram Narayana

అమిత్ షా తనయుడు జై షాపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్య

Ram Narayana