జనరల్ వార్తలు ...

73 ఏళ్ల వయసులో ఏకబిగిన 51 పుషప్స్ .. అదరగొట్టిన తమిళనాడు గవర్నర్!

  • యోగా డే వేడుక‌ల్లో పాల్గొన్న‌ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి
  • 73 ఏళ్ల వయసులో అసాధారణ ఫిట్‌నెస్ ప్రదర్శన
  • ఏకబిగిన 51 పుషప్స్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచిన గవర్నర్
  • మాజీ ఐపీఎస్ అధికారి అయిన రవి చురుకుదనానికి ప్రశంసల వెల్లువ
  • గవర్నర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శారీరక దృఢత్వానికి వయసు ఏమాత్రం అడ్డంకి కాదని తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవి నిరూపించారు. 73 ఏళ్ల వయసులో ఆయన ఏకబిగిన 51 పుషప్స్ తీసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గ‌వ‌ర్న‌ర్ తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం మధురైలోని వెలమ్మాల్ విద్యా సంస్థలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ ఆర్ఎన్ రవి, తన ఫిట్‌నెస్‌తో అక్కడున్న వారిని మంత్రముగ్ధులను చేశారు. ఏమాత్రం అలసట లేకుండా వరుసగా 51 పుషప్స్ పూర్తి చేశారు. ఆయన ఉత్సాహంగా పుషప్స్ చేస్తుండగా, అక్కడున్నవారంతా చప్పట్లతో అభినందించారు.

మాజీ ఐపీఎస్ అధికారి అయిన రవి, తన శిక్షణ కాలం నాటి క్రమశిక్షణను గుర్తుచేస్తూ ప్రతి యోగాసనాన్ని ఎంతో కచ్చితత్వంతో వేసి చూపించారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ తాను ముందుంటానని ఆయన తన చర్యల ద్వారా స్పష్టం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు గవర్నర్ ఫిట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు. “వామ్మో, 73 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉన్నారేంటి?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు “మీది మామూలు బాడీ కాదు సార్” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని గవర్నర్ నిరూపించారని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, బిహార్‌కు చెందిన రవి.. ఫిజిక్స్‌లో మాస్టర్స్ చదివారు. అనంతరం సివిల్స్‌కు సన్నద్దమైన ఆయన 1976లో కేరళ కేడర్‌కు ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. 2021లో రవీంద్ర తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు.

Related posts

వినాయక చవితికి జియో ఎయిర్ ఫైబర్ లాంచ్: ముఖేశ్ అంబానీ

Ram Narayana

ఢిల్లీ ఏఐ సదస్సులో మోదీ సమక్షంలో… చేతులు కలపని ఇద్దరు సీఈవోలు…

Ram Narayana

వివాహానికి ముందు శారీరక సంబంధమా?: రేప్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు…

Ram Narayana