తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం… కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదిక!

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
  • ఈ మేరకు పురపాలక చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
  • అసెంబ్లీలో కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక
  • పెన్‌డ్రైవ్‌ల రూపంలో ఎమ్మెల్యేలకు నివేదిక కాపీల అందజేత
  • మరో రెండు కీలక బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టిన సర్కార్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందుకు వీలు కల్పించేలా తెలంగాణ పురపాలక చట్టం-2019కు సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. రెండో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, పురపాలక చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం లేదని, అందుకే చట్ట సవరణ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. ఈ బిల్లు ఆమోదంతో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా అమలు కానుంది.

ఇదే సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. ఈ నివేదిక కాపీలను ఎమ్మెల్యేలందరికీ పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేశారు.

వీటితో పాటు ప్రభుత్వం మరో రెండు ముఖ్యమైన బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుతో పాటు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లును కూడా సభ పరిశీలనకు పెట్టింది. ఈ బిల్లులపై సభలో చర్చ కొనసాగుతోంది.

అంతకు ముందు సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అడ్డుపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, గవర్నర్ తీరు కారణంగానే జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు.

గతంలో తమ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపిందని రేవంత్ గుర్తుచేశారు. అయితే, గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారని, సుమారు 5 నెలలుగా ఆ బిల్లులు అక్కడే ఉన్నాయని తెలిపారు. “గత ప్రభుత్వం 2018, 2019లో తెచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు రిజర్వేషన్లకు గుదిబండగా మారాయి. వాటిని సవరించేందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తే, దానిని కూడా గవర్నర్ రాష్ట్రపతికి పంపారు” అని సీఎం వివరించారు.

ఈ విషయంపై ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే, బీఆర్ఎస్ ఎంపీలు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని రేవంత్ విమర్శించారు. “బీసీల గురించి మాట్లాడుతున్న గంగుల కమలాకర్ కూడా ఆ ధర్నాకు రాలేదు. వాళ్ల పార్టీ నాయకుడికి బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు. ఇప్పుడు కూడా సభలో గందరగోళం సృష్టిస్తూ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు” అని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీఆర్ఎస్ నేతలు సహకరించాలని, లేదంటే భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Related posts

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ‘సీఎం’ కంటే కేసీఆరే పవర్‌ఫుల్: కేటీఆర్

Ram Narayana

అసెంబ్లీలో బీఆర్ యస్ సభ్యులపై మంత్రి పొంగులేటి ఫైర్

Ram Narayana

ఆర్టీసీ అంశంపై అసెంబ్లీలో హరీశ్ రావు వర్సెస్ పొన్నం ప్రభాకర్

Ram Narayana