తెలుగు రాష్ట్రాలు

నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు.. అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం…

నంద్యాల జిల్లా, మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. బుధవారం రాత్రి  దయ్యాలతిప్ప, మోకాళ్ల తిప్ప, మోటు వంటి అటవీ ప్రాంతాల్లోకి మంటలు చెలరేగాయి.  మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎత్తైన కొండలపై ఉండటం, కాలినడకన వెళ్లేందుకు మార్గం కష్టతరంగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వేసవి కాలం కావడంతో అడవిలో చెట్లు, ఆకులు పూర్తిగా ఎండిపోయి ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కొందరు ఆగంతకులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టి ఉంటారని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కార్చిచ్చు కారణంగా నల్లమల అడవిలోని పులులు, చిరుతలు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. వీటితో పాటు ఎంతో విలువైన, అరుదైన వనమూలికలు, అటవీ సంపద అగ్నికి ఆహుతవుతున్నాయి. భూమార్గంలో మంటలను ఆర్పడం కష్టసాధ్యమని, హెలికాప్టర్ ద్వారా నీటిని చల్లితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ప్రాంతంలో గత నెలలో కూడా కార్చిచ్చు చెలరేగగా, అప్పుడు అధికారులు దాన్ని అదుపులోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి భారీగా మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.

Related posts

వైరా-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై టోల్ వసూళ్లు ప్రారంభం…

Ram Narayana

రాజశేఖర్ రెడ్డి సర్కారు వచ్చినా నేను కట్టిన నిర్మాణాలు కూల్చలేదు: జ్యూరిచ్‌లో చంద్రబాబు

Ram Narayana

 సంక్రాంతికి టీఎస్ఆర్‌టీసీ 4,484 ప్రత్యేక బస్సులు

Ram Narayana