Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేల నష్టపరిహారం సిపిఎం డిమాండ్

వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. వర్షాల వల్ల ధాన్యంలో తేమశాతం పెరిగిన దృష్ట్యా 20% తేమ ఉన్నా కొనుగోలు చేయాలని కోరారు. వెంటనే నష్టాలను అంచనా వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పంట నష్టాలను సేకరిస్తున్నామని తెలిపారు. నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వెంటనే రైతులను అదుకోకపోతే బాధిత రైతులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్వెస్లీ మాట్లాడారు. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు పాలయ్యాయని తెలిపారు. వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయన్నారు. ఎకరానికి రూ.30వేల నుంచి రూ.60వేలకు పైగా రైతులు నష్టపోయారని తెలిపారు. రోడ్లపై ధాన్యం అరబెట్టిన రైతులు వర్షాలతో కొట్టుకుపోయి నష్టపోయారని తెలిపారు. వరదలతో పంట చేలల్లోకి నీరు చేరిందన్నారు. పంటలు దెబ్బతినటంతో పాటు చేలల్లో మేటలు వేసిన ఒండ్రు, ఇతరత్ర చెత్తాచెదారం తొలగించటానికి మరికొంత వెచ్చించాల్సి ఉంటుందన్నారు. అనేక చోట్ల ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించాయని తెలిపారు. పత్తి తీత దశలో వర్షాలు రావటంతో నల్లగా మారిందన్నారు. తద్వారా రైతులు పెట్టుబడి, శ్రమ కోల్పోయారని తెలిపారు. అనేక చోట్ల మొక్కజొన్న రైతులు పరిస్థితి కూడా ఇదే అన్నారు. మరో వారం రోజుల్లో కోతకు వచ్చే వరి కూడా నేలవాలిందన్నారు.

  • బీసీలకు 42% రిజర్వేషన్ అమల్లో బీజేపీ నాటకం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని జాన్వెస్లీడిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ వైఖరి కారణంగానే ఇది అమలు కావటం లేదన్నారు. బీసీల రిజర్వేషన్ విషయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నా… రాజ్యాంగ సవరణ జరగాలన్నా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే అన్నారు. బీసీల విషయంలో బీజేపీ నాటకాలాడుతోందన్నారు. బీజేపీ ఈ విషయంలో ద్వంద్వ వైఖరి అనురిస్తోందన్నారు. 9వ షెడ్యూల్లో దీనిని చేర్చి బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం పోరాదాలనుకునే శక్తులు కేంద్రప్రభుత్వంపైనా పోరాదాలని పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం బీసీల రిజర్వేషన్ ఆర్డినెన్స్, సర్వేలు చేశామంటే కుదరదన్నారు. అఖిలపక్షాలతో కలిసి కేంద్రంపై పోరాడాలని సూచించారు.

  • ఫీజు రీయింబర్స్మెంట్… పోస్టుల భర్తీపై పోరాటం

ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లించటంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగాలేదన్నారు. రూ.8వేల కోట్లుంటే రూ.1200 కోట్లు చెల్లిస్తామని ఒప్పందం చేసుకొని చెల్లించపోవటంతో ప్రయివేటు విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదన్నారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. నిరుద్యోగ జేఏసీ ఆందోళనలకు సీపీఐ(ఎం) మద్దతు ఇస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంనటే 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లలోని పోస్టులనే భర్తీ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు.

  • రాష్ట్ర సమస్యల పరిష్కారంలో బీజేపీ నిర్లక్ష్యం

రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యపూరిత వైఖరి అనుసరిస్తోందని జాన్వెస్లీ ఆరోపించారు. బనకచర్ల విషయంలో ఆంధ్రా-తెలంగాణల వాటా తేల్చాలన్నారు. ఈ విషయంలో ఏకపక్షంగా బీజేపీ వ్యవహరించి తెలంగాణకు అన్యాయం చేయటానికి ప్రయత్నిస్తోందని, దీనిని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లోనూ కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వటం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్డిన్ నిధులు ఇవ్వటంలోనూ నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా లౌకికతత్వాన్ని రూపుమాపి, రాజ్యాంగాన్ని హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సామ్రాజ్యవాద దేశమైన అమెరికాకు కేంద్ర ప్రభుత్వం రంగిపోతోందని, తక్కువ రేటుకు ఆయిల్ సప్లయ్ చేసేందుకు రష్యా సిద్ధపడినా… ట్రంప్ భయంతో మోడీ వెనుకాడుతున్నాడని ఆరోపించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి రంగి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటంలో మోడీ విఫలమవుతున్నాడని ధ్వజమెత్తారు. సామ్రాజ్యవాద విధానాలు, ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలన్నింటితో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.

మొంథా తుఫాను ప్రభావిత మండలాలు కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పర్యటించినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. నాణ్యతతో సంబంధం లేకుండా సీసీఐ కొనుగోలు చేయలని కోరారు. ఎకరానికి 60 బస్తాల దిగుబడి రావాల్సిన వరి 30 బస్తాలు మాత్రమే వస్తుందన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఎండీ అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరాంనాయక్, వై. విక్రమ్, బుర్రి ప్రసాద్, తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేశ్, బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, నవీన్ రెడ్డి, పిట్టల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు – మంత్రి పొంగులేటి

Ram Narayana

వర్గీకరణకు కాలయాపన చేస్తే సహించం …మందా కృష్ణమాదిగ హెచ్చరిక

Ram Narayana

ఖమ్మంలో ఎమ్మెల్సీ కవిత పరామర్శలు

Ram Narayana

Leave a Comment