హిడ్మా మృతి… నిర్ధారించిన పోలీసులు
- మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో హిడ్మా, ఆయన భార్య రాజే సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి
- ఈ రోజు ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు
- మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా తలపై రూ.6 కోట్ల రివార్డు
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా మృతిచెందారు. హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ, మరో నలుగురు మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈమేరకు హిడ్మా, రాజే మరణించిన విషయాన్ని పోలీసులు నిర్ధారిస్తూ వారి మృతదేహాల ఫొటోలను రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఈరోజు ఉదయం కూంబింగ్ చేపట్టాయని ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా తెలిపారు.
గెరిల్లా దాడుల వ్యూహకర్త..
చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీకి ఎంపికైన హిడ్మా.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందారు. ఆయన స్వస్థలం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూర్వాటి గ్రామం. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ హిడ్మా పనిచేశారు.
మృతులు..
మద్వి హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్.
మారేడుమిల్లి అడవుల్లో కాల్పుల మోత.. భారీ ఎన్కౌంటర్.. అగ్రనేత హిడ్మా మృతి

- మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత
- మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్
- పలువురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
మారేడుమిల్లి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నాయకులు సమావేశమయ్యారని, అక్కడ షెల్టర్ తీసుకున్నారని పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో, పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు.ఈ భీకర పోరులో కీలక మావోయిస్టు నేతలు మరణించి ఉండవచ్చని తెలుస్తోంది.
అమిత్ షా డెడ్లైన్ కంటే ముందే హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన భద్రతా బలగాలు

- ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి
- అమిత్ షా విధించిన గడువుకు 12 రోజుల ముందే ఆపరేషన్ సక్సెస్
- అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు
- నక్సలిజం నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్
- హిడ్మా మృతిని ధృవీకరించిన ఏపీ డీజీపీ
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ మద్వి హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విశేషమేమిటంటే, నవంబర్ 30లోపు హిడ్మాను పట్టుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన గడువుకు 12 రోజుల ముందే భద్రతా బలగాలు ఈ లక్ష్యాన్ని ఛేదించాయి.
మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హిడ్మా తీవ్ర గాయాలతో మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, కీలకమైన మావోయిస్టు డాక్యుమెంట్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ పరిణామంపై ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా స్పందించారు. “ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేపట్టాం. నక్సలిజం నిర్మూలనలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది” అని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగానే హిడ్మా లాంటి అగ్రనేతలే లక్ష్యంగా బలగాలు ముందుకు సాగుతున్నాయి. హిడ్మా మృతితో మావోయిస్టు అండర్గ్రౌండ్ నెట్వర్క్కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విజయంతో బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ను మరింత ముమ్మరం చేశాయి.