క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

కేంద్ర సహాయమంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదు…

  • చిక్కుల్లో కేంద్ర సహాయమంత్రి
  • ఓ కార్యక్రమానికి అంబులెన్స్ లో వచ్చిన సురేశ్ గోపి
  • ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ కేసు నమోదు

కేంద్ర సహాయమంత్రి, మలయాళ సూపర్ స్టార్ సురేశ్ గోపీపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తో పాటు, త్రిస్సూర్ పురం సంబరాలకు హాజరయ్యేందుకు వెళుతూ అంబులెన్స్ ను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై ఆయనపై కేసు నమోదు చేశారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 20న త్రిస్సూర్ పురంలోని స్వరాజ్ మైదానానికి ఆయన అంబులెన్స్ లో వచ్చారు. ఈ క్రమంలో ఆయన వన్ వే రోడ్డులో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. అది కూడా రోగులను తరలించే అంబులెన్స్ లో రావడం వివాదాస్పదమైంది. 

అయితే, తాను అనారోగ్య కారణాల వల్లే ఇలా అంబులెన్స్ లో రావాల్సి వచ్చిందని సురేశ్ గోపీ అప్పట్లో వివరణ ఇచ్చారు. కాలు నొప్పితో జనాల్లో నడవలేనని, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేని కొందరు యువజనులు తనకు అంబులెన్స్ ను సమకూర్చారని ఆయన వివరణ ఇచ్చారు. 

కాగా, ఓ కమ్యూనిస్ట్ నేత ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 279, 34 సెక్షన్లు, మోటారు వాహనాల చట్టం కింద 179, 184, 188, 192 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ప్రఖ్యాతిపొందిన సురేశ్ గోపీ రాజకీయాల్లోకి ప్రవేశించడమే కాదు, ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. కేరళలో బీజేపీ తరఫున లోక్ సభకు ఎన్నికైన తొలి ఎంపీగా సురేశ్ గోపీ చరిత్ర సృష్టించారు. ఆయనను కేంద్ర మంత్రివర్గంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయంత్రిగా నియమించారు.

Related posts

సోనియా గాంధీకి అస్వస్థత .. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

Ram Narayana

అనారోగ్యంతో ఉన్నా బాధ్యతను మరువని మన్మోహన్.. నాడు వీల్ చెయిర్ లో రాజ్యసభకు వెళ్లిన వైనం

Ram Narayana

మేఘాలయ పైనాపిల్స్ రుచి చూసిన రాహుల్ గాంధీ

Ram Narayana