- అమరావతిని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న చింతా మోహన్
- తిరుపతిని రాజధానిగా చేయాలని సూచన
- నియోజకవర్గాల విభజన దేశ విభజన భావజాలానికి దారి తీయవచ్చని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిరుపతిని రాజధానిగా చేయాలని ప్రతిపాదించారు.
అమరావతిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఇష్టపడటం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు దానిని “చంద్రావతి” అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిని రాజధానిగా చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదిస్తారని అభిప్రాయపడ్డారు. డిజిటల్ యుగంలో పాలన సాగుతున్నప్పుడు లక్ష ఎకరాల రాజధాని ఎందుకని ప్రశ్నించారు. కేవలం వెయ్యి ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే సరిపోతుందని, భారీ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని హెచ్చరించారు.
ఇక, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంలో తీవ్ర అసమానతలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాదికి 600 సీట్లు వస్తే, దక్షిణాదికి కేవలం 200 సీట్లు వచ్చే ప్రమాదం ఉందని, ఇది దేశ విభజన భావజాలానికి దారితీయవచ్చని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, కానీ డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తొందరపడకూడదని సూచించారు.