జాతీయ వార్తలు

 రెండేళ్లుగా పేలుళ్లకు సన్నాహాలు.. విచారణలో నిజాలు కక్కిన డాక్టర్

  • ఢిల్లీ పేలుడు కేసులో వెలుగులోకి భారీ కుట్ర
  • దేశవ్యాప్తంగా దాడులకు జైషే అనుబంధ ముఠా ప్లాన్
  • సొంతంగా రూ. 26 లక్షలు సమకూర్చుకున్న ఉగ్రవాదులు
  • కుట్రలో కీలకపాత్ర పోషించిన డాక్టర్లు, ఇతర విద్యావంతులు
  • నిందితుడి వాంగ్మూలంతో బయటపడ్డ కీలక నిజాలు

ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఓ విద్యావంతుల ముఠా.. దేశంలోని పలు నగరాల్లో వరుస పేలుళ్లకు భారీ కుట్ర పన్నినట్లు తేలింది. ఈ కుట్రకు 2023లోనే బీజం పడిందని ఓ ఉగ్రవాద నిందితుడు విచారణలో అంగీకరించినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.

ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మహమ్మద్ సహచరుడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్.. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సన్నాహాలు చేస్తున్నట్లు దర్యాప్తు అధికారుల ముందు వెల్లడించాడు. ఈ సమయంలో బాంబుల తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలు, రిమోట్లు, ఇతర సామగ్రిని సేకరించినట్లు తెలిపాడు. హరియాణాలోని గురుగ్రామ్, నుహ్ ప్రాంతాల నుంచి రూ. 3 లక్షలతో 26 క్వింటాళ్ల ఎన్పీకే ఎరువును కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. యూరియా, అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరించే బాధ్యతను షకీల్‌కు అప్పగించగా, వాటిని బాంబులుగా మార్చే పనిని ఉమర్ మహమ్మద్ చూసుకున్నట్లు సమాచారం.

ఈ ఉగ్రకుట్రకు నిందితులే సొంతంగా నిధులు సమకూర్చుకోవడం గమనార్హం. ఈ ముఠా సభ్యులు మొత్తం రూ. 26 లక్షల నగదును పోగుచేశారు. ఉమర్ మహమ్మద్ రూ. 2 లక్షలు ఇవ్వగా, డాక్టర్ షకీల్ రూ. 5 లక్షలు, డాక్టర్ ఆదిల్ రాథర్ రూ. 8 లక్షలు, డాక్టర్ ముజఫర్ రాథర్ రూ. 6 లక్షలు, లక్నోకు చెందిన డాక్టర్ షహీన్ సయీద్ రూ. 5 లక్షలు సమకూర్చారు. పేలుడు ఘటనలో ఉమర్ మహమ్మద్ మరణించగా, మిగిలిన నిందితులను దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.

Related posts

బీజేపీకి వచ్చిన విరాళాలు రూ.10,122 కోట్లు.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు రూ.300 కోట్లకు పైగా!

Drukpadam

గల్వాన్ ఘర్షణ తర్వాత మొదటిసారిగా… చైనా పర్యటనకు ప్రధాని మోదీ…

Ram Narayana

చాహల్ నుంచి పెద్ద మొత్తంలో భరణం డిమాండ్ వార్తలు… ధనశ్రీ కుటుంబం వివరణ!

Ram Narayana