తెలంగాణ వార్తలు

 సిట్ విచారణకు ముందు కేసీఆర్ భావోద్వేగం!

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను విచారిస్తున్న సిట్ అధికారులు
  • ఉద్యమ వ్యూహాలు రచించిన గదిలోనే విచారణపై కేసీఆర్ ఆవేదన
  • విచారణకు న్యాయవాదులను అనుమతించని సిట్
  • నందినగర్ నివాసం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ విచారణ షురూ అయింది. విచారణకు ముందు మధ్యాహ్న భోజన సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది.

తెలంగాణ సాధనకు వ్యూహరచన చేసిన గదిలోనే ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం తనను తీవ్రంగా బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “స్వరాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కీలక చర్చలు జరిపాను. అలాంటి చోట ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు” అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.

విచారణ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నందినగర్ పరిసరాల్లో భారీ బందోబస్తు మోహరించారు. విచారణ ప్రారంభం కాగానే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర నేతలను బయటకు పంపించారు. నిబంధనల ప్రకారం కేసీఆర్ తరఫున న్యాయవాదులను లోపలికి అనుమతించేందుకు సిట్ అధికారులు నిరాకరించారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి ఉదయం నందినగర్‌కు చేరుకున్న కేసీఆర్, మధ్యాహ్నం నుంచి విచారణలో పాల్గొన్నారు. ఈ కేసు విచారణ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Related posts

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బి. మహేశ్ కుమార్ గౌడ్

Ram Narayana

ఎల్ఆర్ఎస్ పేరిట క్రమబద్ధీకరించింది వాళ్లే… మొసలి కన్నీరు కారుస్తోంది వాళ్లే: ఈటల

Ram Narayana

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిప్రదాత…..ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్నుమూత…

Ram Narayana