జాతీయ వార్తలు

చాడీలు చెబితే రూ.5 వేలు ఫైన్.. ఛత్తీస్ గఢ్ గ్రామస్థుల తీర్మానం…

  • ఊళ్లో గొడవలు జరగకుండా ఉండాలనే నిర్ణయం
  • మద్యపాన నిషేధానికి గతంలోనే మేదకీ గ్రామస్థుల కట్టుబాటు
  • మద్యం అమ్మితే 10 వేలు, తాగి గొడవ చేస్తే 11 వేలు జరిమానా

ఒకరిపై మరొకరు చాడీలు చెప్పడం, వదంతులు (గాసిప్స్) వ్యాప్తి చేయడం వంటివి పల్లెల్లో సాధారణమే. ఈ ‘చాడీల’ వల్లే ఊర్లో అనవసరపు గొడవలు, మనస్పర్థలు పెరుగుతున్నాయని ఛత్తీస్‌ గఢ్‌ లోని బలోద్ జిల్లా మేదకీ గ్రామస్థులు భావించారు. అందుకే, ఈ గాసిప్‌లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి ఒక కఠినమైన నిబంధన పెట్టుకున్నారు.
చాడీలకు భారీ పెనాల్టీ
గ్రామంలో ఎవరైనా ఒకరిపై మరొకరికి చాడీలు చెప్పినా లేదా అసత్య ప్రచారాలు చేసినా రూ.5,000 జరిమానా విధించాలని గ్రామ కమిటీ తీర్మానించింది. సోషల్ మీడియా ద్వారా అసత్య వార్తలు వ్యాప్తి చేసినా ఈ జరిమానా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు సాక్ష్యాధారాలతో గ్రామ కమిటీకి ఫిర్యాదు చేస్తే వారికి రూ.1,000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. గ్రామ కమిటీ అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల గ్రామంలో శాంతి, సామరస్యం పెరుగుతాయని వారు నమ్ముతున్నారు.
గతంలోనూ అదర్శనీయ నిర్ణయాలు
మేదకీ గ్రామం ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఐదేళ్లుగా గ్రామాన్ని క్రమశిక్షణలో ఉంచేందుకు కొన్ని నిబంధనలు పాటిస్తున్నారు. ఊర్లో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.10,000 జరిమానా, బహిరంగ ప్రదేశాల్లో తాగి గొడవ చేస్తే రూ.11,000 ఫైన్, గ్రామసభల్లో లేదా పబ్లిక్ ప్లేస్‌లలో అనుచిత పదజాలం వాడితే కూడా జరిమానాలు విధిస్తున్నారు. ‘‘చిన్న చిన్న మాటలను పెద్దవి చేసి గ్రామ వాతావరణాన్ని పాడు చేసే ‘చుగ్లీ’ (చాడీల) సంస్కృతిని అంతం చేయడమే మా లక్ష్యం. దీనివల్ల ప్రజల మధ్య పరస్పర నమ్మకం పెరుగుతుంది’’ అని గ్రామ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Related posts

అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు… హాజరైన అమిత్ షా

Ram Narayana

పహల్గాం ఉగ్ర దాడి: తృటిలో బయటపడ్డ కేరళ జడ్జిలు, ఎమ్మెల్యేలు!

Ram Narayana

ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ రద్దుకు కేంద్రం కీలక ప్రతిపాదన…

Ram Narayana