- సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయం సమీపంలోనే క్షిపణి దాడులు!
- వీధులను కమ్మేసిన దట్టమైన పొగ
- ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీసిన జనం
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు శనివారం నాటికి పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ వాయుసేన ‘ముందస్తు దాడులు’ చేసింది. దీంతో నగరం అతలాకుతలమైంది. వరుస పేలుళ్ల ధాటికి టెహ్రాన్ వీధులు దట్టమైన నల్లటి పొగతో నిండిపోయాయి. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయానికి సమీపంలోనే ఈ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. నగరవ్యాప్తంగా భారీ శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతోందో తెలియక జనం తమ వాహనాల్లో ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
యుద్ధం ముంగిట రెండు దేశాలు
ఈ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఘర్షణ సద్దుమణిగేలా కనిపించడం లేదు. టెహ్రాన్లో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది.