జాతీయ వార్తలు

వైద్య విద్యార్థి ఆత్మహత్య కేసులో ఐదుగురు ఎయిమ్స్ విద్యార్థుల అరెస్ట్

గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వైద్య విద్యార్థి ఆత్మహత్య కేసులో ఐదుగురు ఫైనల్ ఇయర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు రాసిన 17 పేజీల సూసైడ్ నోట్, అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన రతన్‌కుమార్ మేఘ్వాల్ (25) రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మార్చి 14న ఘంటేశ్వర్ సమీపంలోని రైలు పట్టాలపై అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన బ్యాగులో 17 పేజీల సూసైడ్ నోట్ దొరికింది. తన క్లాస్‌మేట్స్ కొంతమంది జనవరి 2026 నుంచి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని అందులో రతన్‌కుమార్ ఆరోపించాడు.

మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురు విద్యార్థులపై ఆత్మహత్యకు ప్రేరేపించడం (భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును ఎస్సీ, ఎస్టీ సెల్‌కు బదిలీ చేశారు. “నిందితులైన ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేసి, వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నాం. కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది” అని ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ చింతన్ పటేల్ తెలిపారు.

కాగా, సోమవారం నుంచి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో, నిందితులు పోలీసుల పర్యవేక్షణలో పరీక్షలు రాసేందుకు కోర్టు అనుమతినిచ్చిందని డీసీపీ రాకేశ్ దేశాయ్ వివరించారు. ఒక యువతితో మృతుడికి ఉన్న సంబంధంపై అనుమానంతోనే నిందితులు వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Related posts

నెల రోజుల్లో కోటీశ్వరుడిగా మారిన మహారాష్ట్ర టమాటా రైతు…!

Drukpadam

ఢిల్లీ జేఎన్‌యూ స్టూడెంట్ ప్రెసిడెంట్‌గా దళిత విద్యార్థి ధనంజయ్

Ram Narayana

యూపీ లోని ప్రయాగ్ రాజ్ లో జర్నలిస్ట్ దారుణ హత్య … 24 కత్తి పోట్లు…

Ram Narayana