తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ దూరం

తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజే అసెంబ్లీలో రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారి కూడా సభకు గైర్హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఆయన వస్తారని అందరూ భావించినా, కేసీఆర్ రాకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కండువాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు.

బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు నేతృత్వంలో గులాబీ శ్రేణులు సభలో నినాదాలతో హోరెత్తించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాలుష్య కారక పరిశ్రమలకు సంబంధించిన ‘హిల్ట్ పాలసీ’ని గవర్నర్ ప్రస్తావించగానే ఇది పెద్ద కుంభకోణమని హరీశ్‌రావు హిందీలో అరిచారు. పెట్టుబడుల సమ్మిట్‌పై గవర్నర్ చదువుతున్న అంశాలన్నీ అబద్ధాలని, ప్రభుత్వం ఆయనతో తప్పుడు మాటలు చెప్పిస్తోందని ఆరోపించారు.

సభలో మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ కండువా లేకుండానే సభకు హాజరయ్యారు. వారంతా అధికార కాంగ్రెస్ సభ్యుల పక్కనే కూర్చోవడం విశేషం. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తమ పార్టీ కండువాలతో మెరవగా, మజ్లిస్ సభ్యులు సంప్రదాయ షేర్వానీలతో కనిపించారు.

అసెంబ్లీ లాబీల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకే చేదు అనుభవం ఎదురైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణలను గన్‌మెన్లు అడ్డుకున్నారు. సీఎం చాంబర్ వద్ద కూడా ఇలాంటి ఆంక్షలు ఉండవని, తమను లోపలికి వెళ్లనివ్వకపోవడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో మరో ఎమ్మెల్యే విజయరమణారావును మాత్రం గన్‌మెన్లు అడ్డుకోకపోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

Related posts

ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో… చూస్తా అనడం సరికాదు: కూనంనేని

Ram Narayana

అసెంబ్లీలో బీఆర్ యస్ సభ్యులపై మంత్రి పొంగులేటి ఫైర్

Ram Narayana

పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందన

Ram Narayana