మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించినట్లు వార్తలు వస్తున్న వేళ.. ఇజ్రాయెల్ నుంచి తీవ్రమైన హెచ్చరికలు వెలువడ్డాయి. మొజ్తబాను ఎక్కడున్నా వేటాడి అంతం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) సంచలన ప్రకటన చేసింది.
ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణం మొజ్తబా నేపథ్యమే. ఆయన చాలాకాలంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) తో పాటు గూఢచార కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడుతున్న హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలకు ఆయన ప్రధాన మద్దతుదారు అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆయన ఇరాన్ అధినేతగా మారడం తమ దేశ భద్రతకు పెను ముప్పుగా నెతన్యాహు ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే, ఇజ్రాయెల్ రక్షణ శాఖ ‘టర్మినేషన్’ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. “మా దేశంపై దాడులకు పాల్పడే ఏ శక్తీ సురక్షితంగా ఉండబోదు. ఇరాన్ కొత్త నాయకత్వం మాతో యుద్ధాన్ని కోరుకుంటే వారి పతనం తప్పదు” అని ఐడీఎఫ్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. గతంలో ఇరాన్ కమాండర్లు, శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్, ఇప్పుడు నేరుగా దేశాధినేతనే టార్గెట్ చేయడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. కొత్త నాయకుడికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. టెహ్రాన్ వీధుల్లో భారీగా సైన్యాన్ని మోహరించినట్లు సమాచారం. మరోవైపు, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’ ఇరాన్లోని తమ నెట్వర్క్ను క్రియాశీలం చేసిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నట్లు అల్ జజీరా తన కథనంలో పేర్కొంది. ఈ పరిణామాలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.