2026 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన స్టార్ క్రికెటర్ సంజు శాంసన్, మైదానం బయట తన వినయంతో అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ప్రపంచకప్ విజయం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా సత్కారం అందుకున్న సందర్భంగా సంజూ ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సోమవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన క్లిఫ్ హౌస్లో ఈ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంప్రదాయ దుస్తుల్లో హాజరైన సంజూ, సీఎం పినరయి విజయన్ పక్కన కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది సంజూకు ఓ గ్లాసులో పానీయం (బహుశా మంచినీళ్లు) అందించారు. అయితే, తాను తాగడానికి ముందు సంజూ వినయపూర్వకంగా ఆ గ్లాసును సీఎంకు అందించాడు. ముఖ్యమంత్రి నవ్వుతూ సంజూనే తాగమని కోరడంతో అతను స్వీకరించాడు. ఈ చిన్న సంఘటనే సంజూ సంస్కారాన్ని, అతని పెంపకాన్ని తెలియజేస్తోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అతనిది” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్, సంజూను ఘనంగా సత్కరించారు. “వియ్ సెల్యూట్ సంజు విశ్వనాథ్ శాంసన్” అనే సందేశంతో పాటు నాకౌట్ దశలో అతని కీలక ఇన్నింగ్స్లను ప్రస్తావించిన జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “భారతదేశ గర్వం, కేరళ ముద్దుబిడ్డ అయిన సంజూ శాంసన్ను క్లిఫ్ హౌస్లో కలవడం ఆనందంగా ఉంది. కేరళ ప్రజల ప్రేమను అతనికి తెలియజేశాను. భవిష్యత్తులో అతను మరిన్ని శిఖరాలను అధిరోహించాలి” అని ఆకాంక్షించారు.
ఈ ప్రపంచకప్లో సంజూ ప్రయాణం పూలపాన్పు కాదు. టోర్నమెంట్ ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో విఫలమవడంతో అతనిపై విమర్శలు వచ్చాయి. ప్రపంచకప్లో తొలి మ్యాచ్కు తుది జట్టులో చోటు కూడా దక్కలేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ను ఆడించారు. అయినప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్ల్లో 80.25 సగటు, 199.37 స్ట్రైక్ రేట్తో 321 పరుగులు సాధించాడు. ముఖ్యంగా వెస్టిండీస్తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో 97 నాటౌట్, ఇంగ్లండ్, న్యూజిలాండ్లతో జరిగిన సెమీ ఫైనల్, ఫైనల్లో 89 పరుగుల చొప్పున కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టు విజయంలో హీరోగా నిలిచాడు.