ఇరాన్పై యుద్ధంలో అమెరికా ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. అయితే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయం చెప్పలేమని అన్నారు. యుద్ధం ముగింపుపై కచ్చితమైన కాలపరిమితిని చెప్పేందుకు ఆయన నిరాకరించారు. యుద్ధం విషయంలో అంతిమ నిర్ణయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్దే అన్నారు. యుద్ధం ముగింపునకు తాము కచ్చితమైన కాలపరిమితిని నిర్దేశించుకోలేదని తెలిపారు.
సౌదీ అరేబియాలోని అతిపెద్ద గ్యాస్ కేంద్రంపై ఇరాన్ దాడికి పాల్పడడంతో ఆగ్రహించిన అమెరికా తీవ్ర పరిణమాలు తప్పవని హెచ్చరించింది. ఇరాన్పై ఈ రోజు భారీ స్థయిలో దాడులకు పాల్పడుతామని, గల్ఫ్ యుద్ధాన్ని తమదైన స్టయిల్లో ముగిస్తామని పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. చనిపోయిన వారిని గౌరవిస్తామని, అనుకున్న పనిని పూర్తి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత యుద్ధాన్ని ముగిస్తామని అభిప్రాయపడ్డారు.
ఇరాన్పై యుద్ధానికి దిగిన మొదటి రోజు నుంచి తమ లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని ఆయన వెల్లడించారు. ఇరాన్ రక్షణ, క్షిపణి తయారీ కేంద్రాలను నాశనం చేశామని, కాబట్టి ఆ దేశం కొత్తగా బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసుకోలేదని అన్నారు. అంతేకాదు ఇరాన్కు చెందిన 11 జలాంతర్గాములను ముంచివేసినట్లు తెలిపారు. ఏయే లక్ష్యాలతో ఇరాన్లో యుద్ధం ప్రారంభించామో అవన్నీ సాధించి, తాము అనుకున్న మిషన్ను పూర్తి చేస్తామని పీట్ హెగ్సెత్ అన్నారు.
ఇరాన్తో యుద్ధం.. రూ.18 లక్షల కోట్లు ఇవ్వాలని పార్లమెంటుకు అమెరికా ప్రతిపాదన
ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికాకు భారీ మొత్తంలో ఖర్చు అవుతోంది. ఇరాన్తో రానున్న రోజుల్లో భీకర యుద్ధం కొనసాగించేందుకు 200 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఇవ్వాలని అమెరికా పార్లమెంటుకు ప్రతిపాదన చేశామని, దీనికి ఆమోదం తెలపాలని పెంటగాన్ కోరినట్లు తెలుస్తోంది. మన కరెన్సీలో ఇది సుమారు రూ.18 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్టు కథనాన్ని ప్రచురించింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం 20వ రోజుకు చేరింది.
దీనిపై ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ అజెండాను అమలు చేయడానికి అమెరికా సొంత పౌరులపై భారం మోపుతోందని ఆరోపించింది. ఈ యుద్ధం మొదలై మూడు వారాలే అయిందని పేర్కొంది. ఇజ్రాయెల్ అజెండా కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని విమర్శించింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. యుద్ధం భారం సామాన్య అమెరికన్లపై పడుతోందని పేర్కొంది.