మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతున్నారు…!!! పశ్చిమ బెంగాల్లో ఆమెను అందరూ ‘దీదీ’ అని పిలుస్తారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ, ఆమె గడుపుతున్న నిరాడంబర జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఒక ఆదర్శంగా నిలుస్తోందని అంటున్నారు. ఇప్పటికీ తన పేరిట ఒక సొంత ఇల్లు, భూమి లేవని ఆమె వెల్లడించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మమత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో కూడా ఆమె ఎప్పటిలాగే తన ట్రేడ్మార్క్ కాటన్ చీర, హవాయి చెప్పులతో ఎంతో సాదాసీదాగా కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
మమతా బెనర్జీ అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలు..
1.బ్యాంకు నిల్వల వివరాలు..
ఇండియన్ బ్యాంక్లో దీదీ పర్సనల్ ఖాతాలో సుమారు రూ.12.4లక్షలు ఉన్నాయి. ఎన్నికల ఖర్చుల కోసం అదే బ్యాంక్లో ఉన్న మరో ఖాతాలో రూ.40,000 ఉన్నాయి. అంటే మొత్తం బ్యాంకు నిల్వలు సుమారు రూ.13 లక్షలు. చేతిలో రూ.75,000 నగదు ఉన్నట్లు మమతా బెనర్జీ తన అఫిడవిట్లో పేర్కొన్నారు.
2.బంగారు ఆభరణాలు:
దీదీ వద్ద కేవలం 9.75గ్రాముల బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయి. 2021లో దాని విలువ రూ.88,887 ఉండగా, ప్రస్తుతం బంగారం రేటు పెరగడంతో రూ.1.75లక్షలకు పెరిగింది.
- స్థిరాస్తులు:
మమత బెనర్జీకి సొంత ఇల్లు లేదు. ఎక్కడ వ్యవసాయ భూమి కానీ, నివాస స్థలాలు కానీ లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. కనీసం వ్యక్తిగత వాహనం కూడా లేదని ఆమె తన అఫిడవిట్లో తెలిపారు. గత ఐదేళ్లలో మమత బెనర్జీ ఆస్తులు తగ్గడం గమనార్హం. కాగా, 2021లో ఆమె చరాస్తులు విలువ రూ.16.72లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు.
4.2025-26 ఆర్థిక సంవత్సరంలో దీదీకి రూ.40,600 టీడీఎస్ రిఫండ్ వచ్చినట్లు తన అఫిడవిట్లో తెలిపారు. ఇక రాయల్టీలు, బ్యాంక్ వడ్డీలు తన ప్రాథమిక ఆదాయ వనరుగా అఫిడవిట్లో పేర్కొన్నారు.
- నామినేషన్ పత్రాల్లో కాళీఘాట్లోని 30-B హరీశ్ చటర్జీ వీధిని తన చిరునామాగా పేర్కొన్నారు. అయితే, ఆ ఇల్లు ఆమె పేరిట రిజిస్ట్రార్ మాత్రం కాలేదు. ఇప్పటి వరకు తనకంటూ ఒక సొంత ఇల్లు లేదని ఆమె అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం.