భాగ్యనగరంలో శోభాయమానంగా గణేష్ నిమజ్జనం ….
-నిమజ్జన దృశ్యాలను చూసి పులకించిన జనం
-ట్యాంక్బండ్ వద్ద భక్తజన సందోహం…
-ఆర్టీసీ బస్సులో వినాయక నిమజ్జనానికి సజ్జనార్..
-ట్యాంక్ బండ్ వద్దకు వేలాది మంది భక్తులు
-ట్యాంక్ బండ్ చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి
-ముమ్మర ఏర్పాట్లు చేసిన పోలీసులు
చివరిసారిగా హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం నిమజ్జనం జరుగుతుండటంతో భక్తులు సాగర్ కు పోటెత్తారు. ట్యాంక బండ్ మొత్తం భక్తులతో కిటకిటలాడింది. గణపతి పప్పా మోరియా నినాదాలతో సాగర్ తీరం మరోమోగింది. చివరి సరిగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరిపేందుకు సుప్రీం కోర్ట్ అంగీకరించడంతో భక్తులు తరలి వచ్చారు కోవిద్ ఉన్నందున మాస్క్ లు ధరించి తగిన జాగ్రత్తలతో నిమజ్జనంలో ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ లో గణేశుడి నిమజ్జనాల నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ఆర్టీసీ బస్సులో కూర్చుని వినాయకుడి విగ్రహాన్ని పట్టుకుని కుటుంబసభ్యులతో కలిసి నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
భక్తులు వేలాదిగా తరలిరావడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతమంతా సందడి నెలకొంది. అనేక ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్కు గణేశుడి విగ్రహాలు తరలివస్తున్నాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో భక్తులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం కూడా ట్యాంక్ బండ్కు చేరుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
చివరిసారిగా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం
రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జన ఏర్పాట్లను తలసాని పరిశీలించారు. అనంతరం హుస్సేన్ సాగర్లో బోటులో తిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాసేపట్లో ఖైరతాబాద్ గణపతి విగ్రహం నిమజ్జనం ముగుస్తుందని చెప్పారు.
మరోవైపు, డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… గణేశ్ నిమజ్జనం సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నామని చెప్పారు. ప్రధాన ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. పోలీసు స్టేషన్లకు సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేశామని చెప్పారు. వీలైనంత త్వరగా నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 10 అడుగులలోపు ఎత్తు ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్, పీవీ మార్గ్ వైపు నుంచి ట్యాంక్స్ బండ్కు తరలిస్తున్నామని తెలిపారు.