అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో రూ. 1.30 కోట్లతో నిర్మించనున్న సైడ్ డ్రెయిన్ల పనులకు శంఖుస్థాపన చేసి, ఏలువారి గూడెంలో రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగులేకున్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఉగాది నుండి దేశంలో ఎక్కడా లేని విధంగా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని, పేదలు కడుపు నిండా భోజనం చేస్తున్నారని అన్నారు. భూ భారతి- కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని, పైలట్ ప్రాజెక్ట్ గా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం వచ్చిందన్నారు. ధరణి చట్టంతో అభద్రతకు లోనైన ప్రజలకు భూ భారతి చట్టంతో భద్రత కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహా రావు, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఎంపిడివో సిలార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
