Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు అరెస్ట్‌!


ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు అరెస్ట్ అయ్యారు. ముంబ‌యి న‌టి జెత్వానీకి వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయ‌న్ను హైద‌రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆంజ‌నేయులును పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు విచారించనున్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పీఎస్ఆర్ ఆంజ‌నేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న స‌స్పెన్ష‌న్‌లో ఉన్నారు.  

జగన్ చూసి రమ్మంటే ఇతడు కాల్చి వచ్చేవాడు: పీఎస్సార్ అరెస్ట్ పై రఘురామకృష్ణరాజు స్పందన

PSR Anjaneyulu Arrest Raghurama Rajus Reaction
  • ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్
  • పీఏస్సార్ చాలా అనైతిక పనులకు పాల్పడ్డారన్న రఘురామ
  • తనపై దాడి కేసులోనూ పీఎస్సార్ కీలక పాత్ర పోషించాడని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులును ఏపీ పోలీసులు నేడు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఆయనను విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ అరెస్టుపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. మంగళవారం ఉదయం టీవీలో ఈ వార్త చూసి సంతోషించానని ఆయన అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పీఎస్సార్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనేక అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని రఘురామ ఆరోపించారు. “జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వ్యక్తి ఇతడు” అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. నటి జెత్వానీ కేసుతో పాటు, తనపై జరిగిన దాడి కేసులో కూడా పీఎస్సార్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారని రఘురామ ఆరోపించారు.

తనపై దాడి జరిగిన కేసులో పీఎస్సార్ ఆంజనేయులు ఏ2 (రెండో నిందితుడు)గా ఉన్నారని రఘురామ గుర్తుచేశారు. ఆయన అరెస్టుతో చాలా మంది తనకు ఫోన్ చేసి, తన కేసు పురోగతి గురించి అడుగుతున్నారని తెలిపారు. ఇదే కేసులో మరో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ప్రమేయం కూడా ఉందని, వీరిద్దరూ కలిసి తనపై దాడికి వ్యూహరచన చేశారని రఘురామ ఆరోపించారు.

పీఎస్సార్ ఆంజనేయులును అరెస్టు చేసిన తరహాలోనే, తన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీవీ సునీల్ కుమార్‌ను కూడా అరెస్టు చేస్తారా అని రఘురామ ప్రశ్నించారు. ఇప్పటివరకు సునీల్ కుమార్‌ను కనీసం విచారణకు కూడా పిలవలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కేసులో విచారణ చాలా నెమ్మదిగా (రోడ్డు రోలర్ వేగంతో) సాగుతోందని, విచారణ ఒకసారి వేగం పుంజుకుంటే ఆగదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

తనపై సుమోటో కేసు నమోదు చేసిన సునీల్ నాయక్ అనే వ్యక్తి బీహార్ నుంచి రావడానికి నిరాకరిస్తున్నాడని రఘురామ తెలిపారు. అలాగే, తన కేసులో వైద్య నివేదికలు తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ను ఇప్పటికే విచారిస్తున్నారని ఆయన వెల్లడించారు. పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టుతో తన కేసు విచారణ కూడా వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్‌పై రోజా ఫైర్

Roja Fires Over PSR Anjaneyulus Arrest
  • మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
  • డర్టీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ రోజా విమర్శలు
  • ఇలాంటి వాటికి ఎవరూ భయపడరంటూ వ్యాఖ్యలు

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్‌పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో స్పందించారు. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి అరెస్టులకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టును ‘డర్టీ డైవర్షన్ పాలిటిక్స్’గా అభివర్ణించిన రోజా, ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. “ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టిన చంద్రబాబు, ఇప్పటివరకు దాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఆ సంతకం చిత్తు కాగితంతో సమానమా?” అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హామీలు నెరవేర్చలేని నిస్సహాయతతోనే, ఎదురుదాడి చేసేందుకు, భయభ్రాంతులకు గురిచేసేందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటి వాటికి ఎవరూ భయపడరని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న ఫైబర్‌ నెట్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌లపై విచారణ జరిపించాలని రోజా సవాల్ విసిరారు. అమరావతి టెండర్ల వ్యయాన్ని రూ.36 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు ఎందుకు పెంచారని నిలదీశారు. ఇది కేవలం దోపిడీకి సిద్ధమవ్వడమేనని, దీనిపై ప్రధాని మోదీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారని స్వయంగా ప్రధాని అన్న మాటలను ఆమె గుర్తు చేశారు.

టీటీడీ గోశాలలో వందలాది ఆవులు, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోయిన ఘటనలపై పవన్ కళ్యాణ్ మౌనం వహించడాన్ని రోజా తప్పుబట్టారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్, ఈ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటమే పవన్ పని అని, ప్రజా సమస్యలను పట్టించుకోరని విమర్శించారు.

వైసీపీ హయాంలో మద్యం దుకాణాలు తగ్గిస్తే, టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటిని పెంచుతూ లంచాలు దండుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మద్యం పాలసీతో ముడిపెట్టి కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకుని, ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని రోజా హితవు పలికారు. అక్రమ కేసులతో వైసీపీ నేతల స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆమె హెచ్చరించారు.

ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు అరెస్ట్‌పై కాదంబరి జత్వానీ న్యాయవాది స్పందన

Kadambari Jethwanis Lawyer Responds on PSR Anjaneyulu Arrest
  • మాజీ ఇంటెలిజెన్స్ చీప్ పి.సీతారామాంజనేయులు అరెస్ట్
  • ఈ మొత్తం వ్యవహారంలో సీతారామాంజనేయులు పాత్ర ఉందన్న జత్వానీ న్యాయవాది
  • బాధితులకు న్యాయం జరగాలని ఆకాంక్ష

ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు నమోదు చేసి, అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి. సీతారామాంజనేయులును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ అరెస్ట్‌పై జత్వానీ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ముంబైలో ఓ పారిశ్రామికవేత్తపై (సజ్జన్ జిందాల్) నటి జత్వానీ పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకే, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెపై, ఆమె కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు బనాయించారని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే కొందరు అధికారులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్ట్ చేశారని తెలిపారు. బాధితులను 50 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధించారని, వారి ఆస్తులను అటాచ్ చేసి, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారని, పాస్‌పోర్టులు సీజ్ చేసి, విదేశాల్లో ఉన్న సోదరుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని వివరించారు.

ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి అడిషనల్ ఎస్పీ విశాల్ గున్నిని సీతారామాంజనేయులు ఆదేశించారని, తన విశాఖపట్నం బదిలీ నిలుపుదల కోసం ఈ పని పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చారని గున్నినే స్వయంగా విచారణలో వెల్లడించినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఈ కుట్రకు సంబంధించిన చర్చలు జరిగాయని గున్ని చెప్పినట్లు తెలిపారు. ఐపీఎస్ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై సమగ్ర విచారణ జరిపి, అసలు సూత్రధారులను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఐపీఎస్ అధికారులకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆయన కోరారు. సీతారామాంజనేయులు అరెస్ట్‌తోనైనా బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు శిక్ష పడాలని శ్రీనివాస్ ఆకాంక్షించారు.

Related posts

నాకు ‘పద్మభూషణ్’ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు: బాలకృష్ణ…

Ram Narayana

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి పవన్ కల్యాణ్ తప్పు చేశారు: చింతా మోహన్

Ram Narayana

కేవీపీకి కౌంటర్ ఇచ్చిన వీహెచ్

Ram Narayana

Leave a Comment