- బాధ్యులైన పోలీసులను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
లగచర్ల ఆడబిడ్డల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మూడేళ్లలో మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్న ఆయన, రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యం లాగా ఓవరాక్షన్ చేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదన్నారు. లగచర్ల బాధితులను ఇంకా కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి అధికారుల పేర్లను రాసిపెట్టుకుంటామన్నారు. రిటైరై ఏ మూలలో దాక్కున్నా తీసుకొచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నందీ నగర్లో కేటీఆర్ ను కలిసిన లగచర్ల బాధితులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆ తరువాత మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ లగచర్ల భూసేకరణ వివాదంలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తాము జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), జాతీయ మహిళా కమిషన్లను ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ వైఖరిని, పోలీసుల తీరును ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా తప్పుబట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. మానవ హక్కుల కమిషన్ నివేదిక తర్వాత అయినా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోని పక్షంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఎన్హెచ్ఆర్సీ సూచించిన విధంగా ఆరు వారాల్లోగా చర్యలు తీసుకోకుంటే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పాత్ర ఉందని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. లగచర్లలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించినప్పటికీ భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేటీఆర్ అన్నారు. దీనిని వెంటనే నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.