- మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్
- ముంబై నటి జత్వాని, ఆమె తల్లిదండ్రుల అరెస్ట్ పథకం ప్రకారమేనని రిమాండ్ రిపోర్ట్
- ఆంజనేయులు, కాంతి రాణా , విశాల్ గున్నీల కాల్ డేటా కీలక ఆధారం
- కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు నకిలీదని మధ్యవర్తుల 164 స్టేట్మెంట్
- విశాల్ గున్నీని సీఎంఓకి పిలిపించి ఒత్తిడి తెచ్చారని ఆరోపణ
ముంబై నటి జత్వాని, ఆమె తల్లిదండ్రుల అక్రమ అరెస్ట్ కేసులో అరెస్టయిన మాజీ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. జత్వాని అరెస్ట్ వ్యవహారం పూర్తిగా ముందస్తు ప్రణాళికతో, పథకం ప్రకారమే జరిగిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.
రిమాండ్ రిపోర్టు ప్రకారం, ముంబై నటి జత్వాని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేయడం వెనుక పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలు ఉన్నాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ అరెస్టులు ఒక పక్కా ప్రణాళికతో జరిగాయని నివేదికలో పేర్కొన్నారు. దీనికి ఆధారంగా 2024 జనవరి నుంచి ఫిబ్రవరి 3వ తేదీ మధ్య అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా తాతా, అప్పటి డీసీపీ విశాల్ గున్నీల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల కాల్ డేటా రికార్డులను (సీడీఆర్) సేకరించినట్లు సీఐడీ తెలిపింది. అంతేకాకుండా, జత్వాని నివాసం ఉండే ప్రాంతంలోని ముంబై పోలీసు అధికారులతో ఆంజనేయులు మాట్లాడిన కాల్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కాల్ డేటాను విశ్లేషించినప్పుడు, అరెస్ట్ ముందస్తు ప్రణాళికతో జరిగిందని స్పష్టమవుతోందని సీఐడీ తెలిపింది.
జత్వానిపై కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు కూడా నకిలీదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ భూ లావాదేవీలకు, జత్వానికి ఎటువంటి సంబంధం లేదని, డబ్బుల బదిలీ జరిగిందని చెప్పిన ముగ్గురు మధ్యవర్తులు న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ కింద వాంగ్మూలం ఇచ్చినట్లు సీఐడీ నివేదికలో తెలిపింది. ఈ వాంగ్మూలాలు కూడా కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు వాస్తవం కాదనేందుకు బలం చేకూరుస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, అప్పటికే విశాఖపట్నం డీసీపీగా బదిలీ అయిన విశాల్ గున్నీని పీఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓకి పిలిపించి ఒత్తిడి చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. ముంబై వెళ్లి నటి జత్వాని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాతే విశాఖపట్నంకు రిలీవ్ చేస్తామని, లేదంటే విజయవాడలోనే ఉండాల్సి వస్తుందని ఆంజనేయులు స్పష్టం చేసినట్లు విశాల్ గున్నీ దర్యాప్తు అధికారి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలను నిర్ధారించుకునేందుకు ఆంజనేయులుకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదని కూడా నివేదికలో తెలిపారు.
పోలీసు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కేసుతో సంబంధం లేని మహిళను, ఆమె తల్లిదండ్రులను ముంబై నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో బలవంతంగా తీసుకురావడం, ఇబ్రహీంపట్నంలోని గెస్ట్ హౌస్లో నిర్బంధించడం, ముంబైలో ఆమె పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని బెదిరించడం వంటి చర్యలు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
అయితే, న్యాయమూర్తి ముందు పీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలు వినిపిస్తూ… ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నందున విషయం తన దృష్టికి వచ్చినప్పుడు కేవలం ‘ఏమిటో చూడండి’ అని మాత్రమే చెప్పానని, అంతకు మించి తన ప్రమేయం లేదని వాదించినట్లు తెలిసింది. చాలా సమయం ఆయనే స్వయంగా వాదించగా, సాంకేతిక అంశాలపై ఆయన న్యాయవాదులు జోక్యం చేసుకున్నట్లు సమాచారం. నిన్న సీఐడీ విచారణకు ఆంజనేయులు సహకరించలేదని, ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లోని కాల్ డేటాను విశ్లేషించిన తర్వాత, మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను పోలీస్ కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సీఐడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.