తెలంగాణ వార్తలు

సీఎం వ్యాఖ్యలపట్ల -ఐజేయూ,టీయూడబ్ల్యూజే హర్షం …అభ్యంతరం ….

సీఎం ప్రకటన పట్ల -ఐజేయూ,టీయూడబ్ల్యూజే హర్షం …అభ్యంతరం …
తమకు అనుకూలంగా వార్తలు రాయకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పడం అభ్యంతరకరం
మీడియా ప్రతినిధుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరించడం తగదు ..

జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిన్న ప్రెస్ మీట్ లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ఇస్తున్న మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేది లేదని ప్రకటించడం మాత్రం ఏ విధంగానూ సమర్ధనీయం కాదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్ష, కార్యదర్శులు కే. శ్రీనివాస్ రెడ్డి, వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మీడియాలో అవాస్తవ కథనాలు వస్తే వివరణ ఇవ్వడం, ఖండించడం, ఇంకా కాదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉంటుంది కానీ, ఆ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వ సౌకర్యాలను ఇవ్వబోమని చెప్పడం సబబు కాదని వారు సూచించారు. మీడియా సంస్థల ఎడిటోరియల్ పాలసీకి జర్నలిస్టులను జవాబుదారీ చేయడం అసంబద్ధమని వారు పేర్కొన్నారు. శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నందుకు గాను ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్యెల్యేల జీత భత్యాలను, సౌకర్యాలను, నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపి వేస్తున్నారా? అని వారు ప్రశ్నించారు. లోపాలను ఎత్తి చూపే మీడియా సంస్థల పట్ల ఇలాంటి వైఖరిని అనుసరించడం సమంజసం కాదనీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందరిని సమదృష్టితో చూసినప్పుడే గౌరవంగా, హుందాగా ఉంటుందనీ అన్నారు.

Related posts

రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ రూ. 25 లక్షలు ఇవ్వలేదు: బక్క జడ్సన్!

Ram Narayana

టిఆర్ఎస్ భవన్ కు రెవిన్యూ శాఖ నోటీసులు…

Ram Narayana

ఎల్బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో డబుల్ డెక్కర్.. ఫ్లైఓవర్‌పైనే మెట్రో!

Ram Narayana