Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

రాడార్ కేంద్రానికి రేవంత్ రెడ్డి సహకరించారు: రాజ్‌నాథ్ సింగ్ అభినందన..

  • సీఎంతో కలిసి వికారాబాద్ జిల్లాలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన
  • పార్టీలు వేరైనప్పటికీ దేశ అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు సాగాలని సూచన
  • కమ్యూనికేషన్‌లో పావురాలు, గుర్రాల దశ నుంచి ఈ స్థాయికి వచ్చామన్న కేంద్రమంత్రి

వీఎల్ఎఫ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరించారని, అందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ రాడార్ స్టేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీలు వేరైనప్పటికీ దేశ అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు.

రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారిందన్నారు. అబ్దుల్ కలాం జయంతి రోజున ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. దేశ భద్రతకు వీఎల్ఎఫ్ స్టేషన్ కీలకమని, కమ్యూనికేషన్ విషయంలో ఈ కమాండ్ సెంటర్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. దేశ రక్షణకు ఇది అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

పావురాలు, గుర్రాల దశ నుంచి ఈ స్థాయికి వచ్చాం

కమ్యూనికేషన్ రంగంలో మనం పావురాలు, గుర్రాల దశ నుంచి ఇక్కడి వరకు వచ్చామన్నారు. తపాలా వ్యవస్థను అనేక ఏళ్ళు వినియోగించుకున్నామని కేంద్రమంత్రి అన్నారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగమని, క్షణాల్లో సమాచారం ప్రపంచానికి చేరుతోందన్నారు. సమాచార విప్లవం ఈరోజు దేశాలన్నింటినీ దగ్గర చేస్తోందని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో సమాచార విప్లవం కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. ఇంట్లో కూర్చొని అనేక కోర్సులు నేర్చుకుంటున్నారని తెలిపారు. 

రాడార్ స్టేషన్ కోసం 2,900 ఎకరాల భూమి అప్పగింత

ఇది భారత నౌకాదళానికి సంబంధించిన వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) రాడార్ స్టేషన్. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో శంకుస్థాపన చేశారు.  

రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం ఇక్కడి అటవీ శాఖకు చెందిన 2,900 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల క్రితం విశాఖపట్నం కేంద్రంగా పని చేస్తోన్న ఈస్టర్న్ నావెల్ కమాండ్‌కు అప్పగించింది. ఇక్కడ రాడార్ స్టేషన్‌తో పాటు టౌన్ షిప్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంకు, మార్కెట్ తదితర సదుపాయాలు ఉండనున్నాయి. 

ఈ టౌన్ షిప్‌లో 3,000 మంది వరకు నివసించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, సిబ్బంది 600 మందికి పైగా ఉంటారు. ఈ వీఎల్ఎఫ్ కేంద్రాన్ని 2027 లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆ విషయంలో రాజకీయాలు చేయం… చేయనివ్వం.. కేంద్రం వెంటే ఉంటాం: రాజ్‌నాథ్‌కు రేవంత్ రెడ్డి హామీ

Revanth Reddy says will cooperate with Modi government
  • వికారాబాద్ జిల్లాలో రాడార్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
  • కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం
  • దేశభద్రత విషయంలో రాజకీయాలు సరికాదని సూచన
  • పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా భద్రత, రక్షణ విషయంలో కేంద్రంతో కలిసే ఉంటామన్న సీఎం

దేశ రక్షణ విషయంలో మేం రాజకీయాలు చేయం… చేయనివ్వమని… తమ ప్రభుత్వం కేంద్రం వెంటే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో రాడార్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… ఈ రాడార్ కేంద్రం ద్వారా దేశ రక్షణ రంగం విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసిందన్నారు.

దేశ రక్షణ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు మంచి పేరు ఉందని వెల్లడించారు. వీఎల్ఎఫ్ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా అత్యంత వ్యూహాత్మక ప్రాంతమన్నారు. కానీ కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. దేశ భద్రత, రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. అలాగే దేశ భద్రత విషయంలో రాజకీయాలు ఏమాత్రం సరికాదన్నారు.

ఈ ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదనే ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు తామూ ముందుకు వచ్చామన్నారు. దేశ భద్రతకు హైదరాబాద్ చాలా కీలకమైన ప్రాంతమన్నారు. ఈ విషయంలో తాము ఎప్పుడూ కేంద్రం వెంటే ఉంటామని స్పష్టం చేశారు.

మన పార్టీలు వేరు… సిద్ధాంతాలు వేరు కావొచ్చు… కానీ దేశ భద్రత, రక్షణ విషయంలో మాత్రం ఎప్పుడూ మీతో కలిసే ఉంటామని రాజ్‌నాథ్ సింగ్‌ను ఉద్దేశించి చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టుల్లో తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నేవీ కాలేజీలో 25 శాతం సీట్లు స్థానికులకు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

రాడార్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీవోలు ఇచ్చారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడటం సరికాదన్నారు.

నేవీ రాడర్ కేంద్రానికి సహకరించాల్సింది పోయి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే బీఆర్ఎస్ దేశ సమగ్రత, భద్రతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుంటుందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రాడార్ కేంద్రంతో తెలంగాణకు మరింత పేరు వస్తుందన్నారు. కాగా, రాడార్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫ్రొఫెషనల్ బైక్ రేసర్ అవతారంలో రాహుల్ గాంధీ

Ram Narayana

ఐదేళ్లూ ఆయనే సీఎం….మంత్రి పాటిల్ కీలక వ్యాఖ్యలు..

Drukpadam

ఢిల్లీ కొత్త సీఎం అతిశీకి నగలు, ఆస్తులు లేకున్నా కోటీశ్వరురాలే!

Ram Narayana

Leave a Comment