- జనవరి 10న నోటిఫికేషన్ విడుదల
- ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- ఫిబ్రవరి 8న ఫలితాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 10న విడుదల అవుతుంది. నామినేషన్ల సమర్పణకు జనవరి 17 చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన జనవరి 18న ప్రారంభం కానుంది. జనవరి 20 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.08 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ను అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందనేది నిరాధార ఆరోపణ: సీఈసీ
- ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని రాజకీయ పార్టీల ఆరోపణలు
- మీడియా ముందుకువచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్
- ఈవీఎంలపై సందేహాలు అక్కర్లేదని స్పష్టీకరణ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందనేది నిరాధార ఆరోపణ అని స్పష్టం చేశారు. ఈవీఎంలు అత్యంత భద్రతతో కూడినవని, ఈవీఎంలపై సందేహాలు అక్కర్లేదని పేర్కొన్నారు. ర్యాండమ్ గా వీవీ ప్యాట్ లలోని స్లిప్పులను లెక్కిస్తున్నామని, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపులో ఇప్పటివరకు ఎక్కడా తేడా రాలేదని తెలిపారు.
పోలింగ్ శాతం పెరుగుదలపైనా తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. పోలింగ్ సమయం ముగిసే సమయానికి ఎంతో పోలింగ్ శాతం నమోదైందో ఒకసారి ప్రకటిస్తున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ సమయం ముగిశాక… అప్పటికే క్యూలైన్లలో ఉన్నవారు ఓటేస్తున్నారని, కొన్ని చోట్ల రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతోందని వెల్లడించారు. అందువల్ల పోలింగ్ శాతంపై చివరి లెక్కలు ఆలస్యంగా వస్తున్నాయని వివరించారు.
గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ పార్టీలు ఈవీఎంలను నిందిస్తుండడం తెలిసిందే. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందంటూ పలు పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం పైవిధంగా స్పందించింది.