- డోజ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వివేక్ రామస్వామి
- అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తొలుత పోటీ పడిన వివేక్
- పోటీ నుంచి తప్పుకుని ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వివేక్
- తన కార్యవర్గంలో కీలకమైన డోజ్ బాధ్యతలను ఎలాన్ మస్క్తో పాటు వివేక్ రామస్వామికి అప్పగించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ట్రంప్ కార్యవర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే అందుకు గల కారణాలను వెల్లడించలేదు.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. అయితే చివరికి రేస్ నుంచి తప్పుకుని ట్రంప్కు మద్దతు పలికారు. ట్రంప్ గెలుపుకు కృషి చేశారు. దీంతో తన గెలుపులో కీలక పాత్ర పోషించిన వివేక్ రామస్వామితో పాటు ఎలాన్ మస్క్కు తన కార్యవర్గంలో ట్రంప్ కీలక పదవులు కట్టబెట్టారు. కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ) బాధ్యతలను వారికి అప్పగించారు.
అయితే ట్రంప్ బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే రామస్వామి కీలక నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. రామస్వామి ఆ పదవి నుంచి తప్పుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని భావిస్తున్నారు. గవర్నర్గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వివేక్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒహైయో గవర్నర్ ఎన్నికలు నవంబర్ 2026లో జరగనున్నాయి.