నవమికి భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు …మంత్రి పొంగులేటి
- అంచనాకు మించి భక్తులు వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది
- భారీ ఏర్పాట్లు చేయండి
- తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి సమీక్షా సమావేశం
- వేడుకలకు సిద్ధమవుతున్న మిథిలా స్టేడియం పరిశీలన
ఏప్రిల్ మొదటి వారంలో జరిగే శ్రీ రామనవమి మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని , ఈసారి అంచనాకు మించి భక్తులు కూడా ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉందని కావున ఎవరికీ అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నవమి ఏర్పాట్ల పై మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బి, విద్యుత్, ఆర్ డబ్ల్యూ ఎస్, శానిటేషన్, హెల్త్, రవాణా, ఫైర్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులను నవమికి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు నవమి వేడుకలకు సిద్దమవుతున్న మిథిలా స్టేడియాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… శ్రీరామనవమి, పట్టాభిషేకానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ అన్ని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి అధికంగా ఉన్నందున మంచినీటి కేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేయాలన్నారు. స్నానఘట్టాలను, ఆలయ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పార్కింగ్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే అతిథులందరికీ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువగా ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కల్యాణం అనంతరం స్వామి వార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శన భాగ్యం కల్పించాలని తెలిపారు. ట్రాఫిక్ కు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా ముందుగానే ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచుకుని నవమి ఉత్సవాలను అట్టహాసంగా జరపాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఆర్డీవో దామోదర్ , వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి ఇఫ్తార్ విందు
ఆత్మీయత…. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్



- తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- కొత్తగూడెం క్లబ్ లో కొత్తగూడెం నియోజకవర్గ ముస్లిం సోదరులకు మంత్రి పొంగులేటి ఇఫ్తార్ దావత్
- 1000మందికి పైగా ముస్లిం సోదరులు హాజరు
- పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు…ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్ లో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఆదివారం ఇఫ్తార్ విందుని ఇచ్చారు. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి హాజరైన ఈ ఇఫ్తార్ దావత్ లో నియోజకవర్గంలోని సుమారు 1000మందికి పైగా ముస్లిం సోదరులు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ వారి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.