- పుప్పాల గూడ పరిసరాల్లో 450 ఎకరాల భూమి వుంది
- హబ్ ఏర్పాటుతో 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది
- తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
సుప్రీం కోర్టు రద్దు చేసిన సొసైటీల భూముల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్లోని పుప్పాల గూడ పరిసర ప్రాంతాల్లోని 450 ఎకరాల్లో ఈ ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఐటీ హబ్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ, స్పెషల్ పోలీసు సొసైటీలకు కేటాయించిన ఈ భూముల్లో ఐటీ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ వివిధ సంస్థలకు కేటాయించిన 200 ఎకరాల భూ కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే టీజీఐఐసీకి చెందిన 250 ఎకరాల భూమి కూడా ఉందని, ఈ రెండు ప్రాంతాలను కలిపి మొత్తం 450 ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఐటీ నాలెడ్జ్ హబ్ ద్వారా దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.