- రేవంత్ సర్కారుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న
- అప్పులపై డిప్యూటీ సీఎం భట్టి అన్నీ అబద్దాలే చెబుతున్నారు
- తెలంగాణాను బీఆర్ఎస్ ఆగం కానివ్వదు
- కేసీఆర్ కు, కార్యకర్తలకు మధ్య వారధిగా వుంటా
- ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఒక ద్రోహి
- ఉప ఎన్నిక వస్తే భద్రాచలంలో బీఆర్ఎస్ గెలుస్తుంది

రేవంత్ రెడ్డి సర్కార్ అప్పు చేసిన లక్షా 60 వేల కోట్ల రూపాయలను ఎక్కడ, ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాలకులను డిమాండ్ చేశారు. సోమవారం ఆమె భద్రాచలంలో జరిగిన ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెచ్చిన అప్పులపై సర్కారును ప్రశ్నిస్తే బుకాయిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అప్పులపై విపరీతమైన అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. 40 వేల కోట్ల రూపాయల విలువైన భూములను 10 వేల కోట్ల రూపాయలకు ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. ఆ10 వేల కోట్లతో రైతు భరోసా, రుణ మాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారని, కానీ ఇప్పటికీ 60 శాతం మందికి రుణ మాఫీ కాలేదు, 50 శాతం మందికి రైతు భరోసా రాలేదని అన్నారు. మరి ఈ 10 వేల కోట్ల రూపాయలు ఎక్కడకు పోయినట్లని కవిత సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుత పాలకులు చూడడానికి తెలంగాణ అభిమానుల్లా ఉంటారు, కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తుంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేక కల్లి బొల్లి మాటలు చెప్పి, లేని పోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి16 నెల్లు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయ లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు కూడా తేలేదన్నారు. ఆత్మీయ భరోసా కింద నిరుపేదలకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిల బెట్టిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసు కోకుండా కేసీఆర్ పని చేశారని చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్షని, తెలంగాణను కాపాడడమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రథమ కర్తవ్యమని ఉద్భోధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. కళ్ల ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకొనే ప్రశక్తే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమర పాటుగా ఉంటే కచ్చితంగా కాంగ్రెస్ తెలంగాణను ఆగం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడి కక్కడ నిలదీయాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ కు, పార్టీ కార్యకర్తలకు తాను వారిధిగా ఉంటానని, కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. ఏ చిన్న అవసరమున్నా తనను కార్యకర్తలు సంప్రదించాలని, కార్యకర్తలను కాపాడు కోవడం తన బాధ్యతని పేర్కొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్ లో చేరిన ద్రోహని విమర్శించారు. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి ద్రోహులను చాల మందినిచూశామని, అనేక కుట్రలను కూడా చూశామన్నారు.ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు సూదన్, మాజీ ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న కవిత
అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు అధికార్లు కవితకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. కవిత వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు సూదన్, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ, చంద్రావతి, నాయకులు దిండిగల రాజేందర్, రామ్మూర్తి తదితరులు వున్నారు.
