పెహల్గామ్ ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తో భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు అఖిలపక్ష సమావేశానికి (All Party Meet) పిలుపు నిచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా తెలిపాయి. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సహా సీనియర్ మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గురించి ప్రతి పక్ష నాయకులకు వివరించనున్నారు. అదేవిధంగా జాతీయ భద్రత విషయాలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. మరో వైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిశారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ప్రధాని.. ముర్ముతో కాసేపు భేటీ అయ్యారు. పాక్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. సరిహద్దు వద్ద తాజా పరిస్థితి, ప్రభుత్వ చర్యలను రాష్ట్రపతి ముర్ముకు వివరించారు.
