General Manoj Mukund Naravane (Retd)
జాతీయ వార్తలు

యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు …  భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే

  • ఎన్నో కుటుంబాలు ప్రియమైన వారిని కోల్పోవాల్సి ఉంటుందని వ్యాఖ్య
  • సరిహద్దుల్లో నివసించే వారి పరిస్థితి దారుణంగా ఉంటుందన్న మాజీ ఆర్మీ చీఫ్
  • యుద్ధం అనివార్యమైతే తప్ప, అది చివరి ప్రత్యామ్నాయంగానే ఉండాలని సూచన

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్న తరుణంలో, భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధమంటే రొమాంటిక్ వ్యవహారం కాదని, అదొక బాలీవుడ్ సినిమా అసలే కాదని ఆయన స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణానికి స్వస్తి పలికి, దౌత్య మార్గాల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుణెలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో జనరల్ నరవణె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “యుద్ధం లేదా హింస అనేవి మనం ఆశ్రయించాల్సిన చివరి మార్గాలు కావాలి. అందుకే మన ప్రధానమంత్రి ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని అన్నారు. అవివేకులైన కొందరు మనపై యుద్ధాన్ని రుద్దినా, మనం దానిని ప్రోత్సహించ కూడదు” అని పేర్కొన్నారు. పూర్తి స్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారని చెబుతూ, “ఒక సైనికుడిగా, ఆదేశాలు వస్తే నేను యుద్ధానికి వెళతాను. కానీ, అది నా మొదటి ఎంపిక కాదు” అని జనరల్ నరవణె తేల్చిచెప్పారు. దౌత్యానికి, చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవడానికే తాను ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని, సాయుధ పోరాటం వరకు పరిస్థితి రాకుండా చూడాలని కోరుకుంటానని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా పిల్లలు పడే  ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. “షెల్లింగ్ జరిగినప్పుడు, రాత్రి పూట సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయాల్సి రావడం వంటి భయానక దృశ్యాలు చిన్నారుల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధ తరతరాలు వెంటాడుతుంది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ) బారిన పడిన వారు, భయంకరమైన ఘటనలు చూసిన ఇరవై ఏళ్ల తర్వాత కూడా చెమటలతో నిద్రలేచి, మానసిక చికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఉంటాయి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశాల మధ్యే కాకుండా, కుటుంబాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, వర్గాల మధ్య కూడా విభేదాలను హింస ద్వారా కాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. “జాతీయ భద్రతలో మనమందరం సమాన భాగస్వాములం. హింస దేనికీ సమాధానం కాదు” అని నరవణె ఉద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ లు శనివారం భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో జనరల్ నరవణె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Related posts

2036 నాటికి 152 కోట్లు దాటనున్న మన దేశ జనాభా!

Ram Narayana

మీడియా స్వేచ్ఛ పీకనొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి …సుప్రీం సిజెఐకి 18 మీడియా సంస్థల లేఖ ..

Ram Narayana

ఎల్లుండి దేశవ్యాప్త సమ్మె.. 30 కోట్ల మంది కార్మికులు పాల్గొనే అవకాశం!

Ram Narayana