- క్రీస్తుపూర్వం1, క్రీస్తు శకం3వ శతాబ్దాల మధ్య నాటిదని అంచనా
ఖమ్మం జిల్లాలో అరుదైన బుద్ధ విగ్రహం తవ్వకాల్లో బయట పడింది . చింతకాని మండలం నాగులవంచలో బయట పడిన అతి పురాతనమైన ఈ విగ్రహాన్ని పాలరాతితో చేసిన విగ్రహమని భావిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు కోలేటి నాగేశ్వర రావు వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో శనివారం ఉపాధి హామి కూలీలు మట్టి తవ్వుతుండగా ఈ విగ్రహం బయట పడింది. అక్కడే మరో 2 శిలలను కూడా గుర్తించారు. ఆ ప్రాంతంలోనే గతంలో మట్టి కుండలు, పాత్రలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలియడంతో రెవిన్యూ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. విగ్రహాన్ని రైతు పోలీసులకు అప్పగించాడు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు విగ్రహం బయట పడిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఆ పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం క్రీ.పూ. ఒకటి- క్రీ.శ. మూడో శతాబ్దం మధ్య కాలం నాటిదని అంచనా వేశారు.