ఆంధ్రప్రదేశ్

లిక్కర్ స్కామ్ విచారణకు డుమ్మా కొట్టిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

  • విచారణకు హాజరయ్యేందుకు మూడు రోజుల గడువు కోరిన మోహిత్ రెడ్డి
  • ఈ కేసులో ఏ-39గా ఉన్న మోహిత్
  • ఇప్పటికే ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మోహిత్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించినప్పటికీ, ఆయన సిట్ ఎదుట హాజరుకాలేదు. వివరాల్లోకి వెళితే, మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఈరోజు తమ ఎదుట హాజరు కావాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే, వ్యక్తిగత కారణాలతో ఆయన ఈరోజు విచారణకు రాలేదని సమాచారం. విచారణకు హాజరయ్యేందుకు తనకు మూడు రోజుల సమయం కావాలని మోహిత్ రెడ్డి సిట్ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆయన ఏ-39వ నిందితుడిగా ఉన్నారు. మరోవైపు, ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు మోహిత్ రెడ్డి ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు, ఆయన బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేశ్ నాయుడును సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ కేసులో తండ్రీకొడుకుల పాత్ర ఉందని సిట్ అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొంటూ కోర్టుకు నివేదిక సమర్పించారు. గత శుక్రవారమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

Related posts

సీఎం జ‌గ‌న్‌తో బుగ్గ‌న‌, స‌జ్జ‌ల మ‌రోసారి కీల‌క భేటీ!

Drukpadam

మేం చర్చలకు రమ్మంటుంటే అంత అలుసా?: మంత్రి బొత్స

Drukpadam

షావోమీ ఏసీ.. 30 సెకండ్లలోనే గది అంతా కూల్!

Drukpadam