జాతీయ వార్తలు

ముంబైలో రెడ్ అలెర్ట్.. స్కూళ్లు, కాలేజీల బంద్…

  • ముంబై నగరాన్ని ముంచెత్తుతున్న కుండపోత వర్షాలు
  • వివిధ ఘటనలలో రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురి మృతి
  • మూడు రోజుల్లోనే 550 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం
  • పొంగిపొర్లుతున్న విరార్ సరస్సు

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో మహానగరం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నేడు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది. నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం సెలవు ప్రకటించింది.

నిన్న కురిసిన వర్షాలకు ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల చెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో నీరు చేరడంతో, ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ సూచించింది.

ఈ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలో జరిగిన వేర్వేరు విషాద ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. గోద్రెజ్ బాగ్ అపార్ట్‌మెంట్‌లో గోడ కూలి సతీష్ టిర్కే (35) అనే వాచ్‌మన్‌ మృతి చెందాడు. వాల్మీకి నగర్‌లో ఓ వ్యక్తి డ్రైనేజీలో కొట్టుకుపోగా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. మరో దారుణ ఘటనలో, పాఠశాల నుంచి కుమారుడిని తీసుకుని వస్తున్న యులోజియస్ సెల్వరాజ్ (40) అనే మహిళ, ఆమె ఏడేళ్ల కుమారుడు ఆంటోనీ బెస్ట్ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.

కేవలం 81 గంటల వ్యవధిలోనే ముంబైలో 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దాదాపు ఆగస్టు నెల సగటు వర్షపాతంతో సమానం కావడం గమనార్హం. నగరానికి తాగునీరు అందించే ఏడు సరస్సులలో ఒకటైన విరార్ సరస్సు సోమవారం మధ్యాహ్నం నిండి పొంగిపొర్లింది. రత్నగిరి, రాయగడ్, హింగోలి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశించారు.

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం.. మునిగిన రోడ్లు.. 250కిపైగా విమానాల ఆలస్యం

Mumbai Rains Heavy Rains Disrupt Life Flight Delays

ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి, శివారు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ, బీఎంసీ కార్యాలయాలకు నేడు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని బీఎంసీ గట్టిగా సూచించింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు.

భారీ వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. సెంట్రల్ రైల్వే లైన్‌లో రైళ్లు 20 నుంచి 30 నిమిషాలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 155 విమానాలు, నగరానికి రావాల్సిన 102 విమానాలు ఆలస్యమైనట్లు ఫ్లైట్ రాడార్ డేటా వెల్లడించింది. వర్షాల కారణంగా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని, విమానాల రాకపోకల్లో జాప్యం జరుగుతోందని ఇండిగో సంస్థ కూడా ఓ ప్రకటనలో తెలిపింది.

నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంధేరి వెస్ట్‌లోని ఎస్వీ రోడ్డులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సియాన్‌లోని గాంధీ మార్కెట్, దాదర్ టీటీ, ముంబై సెంట్రల్ వంటి ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వసాయిలోని మితాఘర్ ప్రాంతంలో వరద నీటిలో దాదాపు 200 నుంచి 400 మంది చిక్కుకున్నట్లు సమాచారం. నేటి ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో విఖ్రోలిలో అత్యధికంగా 255.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, బైకుల్లాలో 241.0 మి.మీ., శాంతాక్రూజ్‌లో 238.2 మి.మీ. వర్షం కురిసింది.

అండర్ పాస్ లో చిక్కుకున్న కారు.. ఈదుకుంటూ వెళ్లి కాపాడిన స్థానికులు.. !

Thane Underpass Flooding Car Stranded Rescued by Locals

థానే జిల్లా నారీవలి, ఉత్తరశివ్ గ్రామాల మధ్య ఉన్న అండర్ పాస్ లోకి భారీగా వరద చేరింది. ఈ విషయం తెలియక అండర్ పాస్ లోకి ప్రవేశించిన ఓ కారు మధ్యలోనే ఆగిపోయింది. నడుములోతు నీటిలో కారు దాదాపుగా మొత్తం మునిగిపోయింది. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు సాయం కోసం కేకలు వేయగా.. అక్కడున్న స్థానిక యువకులు స్పందించారు. ఈదుకుంటూ వెళ్లి కారును తోసేందుకు ప్రయత్నించారు.

అయినా కారు ముందుకు కదలకపోవడంతో లోపల ఉన్న వ్యక్తులను బయటకు తీసి రోడ్డుపైకి చేర్చారు. ఈ ఉదంతాన్ని ఓ యువకుడు తన ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. కాగా, ముంబై సహా రాయ్ గఢ్, థానే, నవీ ముంబై తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. కళ్యాణ్ లో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Related posts

మోదీ మా నమ్మకాన్ని కోల్పోయారు.. నెటిజన్ల మిశ్రమ స్పందన

Ram Narayana

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్… 18 మంది మావోల మృతి…

Ram Narayana

ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన…

Ram Narayana