బిజినెస్ వార్తలు

డ్యూటీకి రాని కో పైలెట్.. గంటపాటు నిలిచిన ఇండిగో విమానం!

  • శంషాబాద్‌లో గంట ఆలస్యంగా బయల్దేరిన ఇండిగో విమానం
  • ప్రయాణికులు, సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం
  • జనసేన నేత వీడియోతో వెలుగులోకి ఘటన
  • ఉదయం 9.50కి వెళ్లాల్సిన ఫ్లైట్ 10.50కి టేకాఫ్
  • కో పైలెట్ లేక విమానం ఆగడం ఇదే తొలిసారి

శంషాబాద్ విమానాశ్రయంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. కో పైలెట్ సమయానికి విధులకు హాజరుకాకపోవడంతో ప్రయాణికులతో సిద్ధంగా ఉన్న ఓ విమానం దాదాపు గంటపాటు ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. శనివారం ఉదయం శంషాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఈ సంఘటన జరిగింది.

ఇండిగో సంస్థకు చెందిన 6ఈ 6263 విమానం ఉదయం 9:50 గంటలకు ముంబైకి బయలుదేరాల్సి ఉంది. ఇందుకోసం ప్రయాణికులంతా 9:40 గంటలకే విమానంలోకి చేరుకున్నారు. ప్రధాన పైలెట్ కూడా విధులకు హాజరయ్యాడు. అయితే, కో పైలెట్ మాత్రం ఎంతసేపటికీ రాకపోవడంతో విమానం టేకాఫ్ కాలేదు.

విమానం ఆలస్యం కావడంతో అసహనానికి గురైన ప్రయాణికులు సిబ్బందిని ప్రశ్నించారు. కో పైలెట్ ఇంకా రాలేదని సిబ్బంది చెప్పడంతో ప్రయాణికులకు, వారికి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న జనసేన నేత అజయ్ కుమార్, ప్రయాణికుల ఇబ్బందులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

సుమారు గంట ఆలస్యంగా కో పైలెట్ రావడంతో, విమానం 10:50 గంటలకు ముంబైకి బయల్దేరి వెళ్లిందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. సాధారణంగా సాంకేతిక కారణాల వల్ల విమానాలు ఆలస్యమవుతుంటాయి. కానీ, కో పైలెట్ రానందువల్ల విమానం ఆగిపోవడం ఇదే మొదటిసారి అని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు.

Related posts

ఐటీ రంగంలో పెను ప్రకంపనలు: ఒరాకిల్‌లో ఒకేసారి 30,000 మందిపై వేటు?

Ram Narayana

మార్కెట్లో భిన్నమైన ట్రెండ్.. షేర్లు డీలా.. గోల్డ్ జోరు!

Ram Narayana

బీఎస్ఎన్ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో.. సరసమైన ధరల్లో నయా ఆఫర్ల ప్రకటన

Ram Narayana