అభ్యుదయ సాహిత్యంతో సమాజ మార్పు
కవులు సామాజిక సమస్యలపై స్పందించాలి
అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవిఎల్
సమాజ మార్పుకు, చైతన్యానికి కవులు, కళాకారులు తోడ్పాడాలని అభ్యుదయ సాహిత్యంతో సమాజంలో మార్పు తథ్యమని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవిఎల్ తెలిపారు. కవులు సామాజిక సమస్యలపై స్పందిస్తూ రచనలు చేయాలని, మారిన పరిస్థితుల్లో అభ్యుదయ సాహిత్య అవసరం పెరుగుతుందన్నారు. అభ్యుదయ రచయితల సమావేశం ఆదివారం స్థాని గిరిప్రసాద్ భవన్లో లెనిన్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కెవిఎల్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలోనూ, సాయుధ తెలంగాణ పోరాట కాలంలోనూ వెలువడికా సాహిత్యం దేశ ప్రజలను జాగృతం చేసింది. పాటలు అనేక ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాయి. ముఖ్యంగా ప్రజలను మేల్కొలిపే పాటలు, కథలు, కవితలు, విధి నాటకాలు మరింతగా వెలువడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బండి యాదగిరి అలపించిన బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడకో నైజాం సర్కారోడా అన్న పాట యావత్ తెలంగాణ ప్రజలన కార్యోన్ముఖులను చేసిందని కెవిఎల్ తెలిపారు. అధునిక యుగంలో డిజిటల్ వ్యవస్థపై నేటి తరం ఆధారపడిన పాటకు ప్రజా సాహిత్యానికి పదును తగ్గలేదు. ప్రజా సాహిత్యం విరివిగా వెలువడితే అందుకా అనుగుణంగా కళారూపాలు పుట్టుకొస్తాయని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కెవిఎల్ కోరారు. సిపిఐ -శతాబ్ది ఉత్సవ ముగింపు సంబురాలు డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు నేటి పరిస్థితులపై అభ్యుదయ రచయితల నుండి రచనలను ఆహ్వానిస్తుందని ఆయన తెలిపారు. చైతన్యగుమ్మంగా వామపక్ష ఉద్యమ పురిటి గడ్డగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కవులు, సాహిత్యవేత్తలు సమకాలీన పరిస్థితులపై స్పందించి రచనలు చేయాలని ఆ రచనలను పుస్తక రూపంలో తీసుకొస్తామన్నారు. అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో సెమినార్లు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు కెవిఎల్ తెలిపారు. ఈ సమావేశంలో అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లెర్ల వీరస్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, కవులు రౌతు రవి, కన్నెకంటి వెంకటయ్య, నిధి, కాంతేశ్వరరావు,
గోపిశెట్టి వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, భారతి, శైలజ తదితరులు పాల్గొనగా శింగు నర్సింహారావు ఆహుతులను వేదికపైకి ఆహ్వానించి లక్ష్యాన్ని వివరించారు.