ఆంధ్రప్రదేశ్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: ధనుంజయరెడ్డి సహా ముగ్గురి డీఫాల్ట్ బెయిల్ రద్దు…

  • మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు షాక్
  • ఈ నెల 26లోగా లొంగిపోవాలన్న హైకోర్టు 
  • సీఐడీ పిటిషన్‌పై విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించిన న్యాయస్థానం

మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ నెల 26వ తేదీలోగా ఏసీబీ కోర్టు ఎదుట లొంగిపోవాలని వారిని ఆదేశిస్తూ నిన్న కీలక తీర్పు వెలువరించింది.

జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ తీర్పును వెలువరించారు. నిందితులు లొంగిపోయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వారికి వెసులుబాటు కల్పించారు. అయితే, వారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై తాజా కేసు మెరిట్స్ ఆధారంగా విచారణ జరపాలని, ఈ తీర్పులోని అభిప్రాయాలతో ప్రభావితం కావొద్దని ఏసీబీ కోర్టుకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తొలుత 24వ తేదీలోగా లొంగిపోవాలని ఆదేశించినా, నిందితుల తరఫు న్యాయవాదుల అభ్యర్థనతో గడువును 26వ తేదీకి పొడిగించారు.

సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ అసంపూర్ణంగా ఉందన్న కారణంతో ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఏసీబీ కోర్టు ఈ ముగ్గురికీ డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. తమ దర్యాప్తు పూర్తయిందని, చార్జిషీటు దాఖలు చేశాకే నిందితుల రిమాండ్‌ను కోర్టు పలుమార్లు పొడిగించిందని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. చార్జిషీటు తర్వాత రెగ్యులర్ బెయిల్ తిరస్కరించిన కోర్టు, ఆ తర్వాత డీఫాల్ట్ బెయిల్ ఇవ్వడం పరస్పర విరుద్ధమని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఐడీ వాదనలతో ఏకీభవిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు.

Related posts

త్వరలో పాపికొండల యాత్ర.. ప్రారంభానికి పర్యాటక శాఖ అనుమతి!

Drukpadam

కుక్క మాంసం అమ్మకాలపై నిషేధాన్ని కొట్టివేసిన గౌహతి హైకోర్ట్!

Drukpadam

పక్క రాష్ట్రాల క్యాబ్ లు మా పొట్ట కొడుతున్నాయి.. పోలీసులకు తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఫిర్యాదు!

Drukpadam