ఆంధ్రప్రదేశ్

తిరుమలలో ఏఐ టెక్నాలజీ.. శ్రీవారి దర్శనం ఇక మరింత సులభం…

  • తిరుమలలో అందుబాటులోకి ఏఐ ఆధారిత ఐసీసీసీ కేంద్రం
  • శ్రీవారి భక్తుల దర్శన సమయాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం
  • క్యూలైన్లు, అన్నప్రసాదాల నిర్వహణలో ఆధునిక సాంకేతికత
  • ఫేస్ రికగ్నిషన్ కెమెరాలతో భద్రతను పటిష్ఠం చేస్తున్న టీటీడీ

శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను (ఐసీసీసీ) అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కొత్త వ్యవస్థ ద్వారా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఏ కంపార్ట్‌మెంట్‌లో భక్తులు ఎంతసేపటి నుంచి వేచి ఉన్నారనే వివరాలను ఏఐ టెక్నాలజీతో గుర్తిస్తారు. ఎక్కువసేపు నిరీక్షిస్తున్న వారికి ప్రాధాన్యతనిచ్చి, వారిని త్వరగా దర్శనానికి పంపేలా చర్యలు తీసుకుంటారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ వివరించారు. భక్తులు క్యూలైన్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి దర్శనం పూర్తయ్యే వరకు పూర్తి సమాచారం డాష్‌బోర్డులో కనిపిస్తుంది.

దర్శనమే కాకుండా, అన్నప్రసాదాల వితరణను కూడా ఈ కేంద్రం సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఎంతమంది భక్తులకు అన్నప్రసాదం అందించారు, ఇంకా ఎంతమందికి అవసరం అనే వివరాలను తెలుసుకుని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. భద్రతను పెంచేందుకు 250 ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను (FRC) కొనుగోలు చేయనున్నారు. నేర చరిత్ర ఉన్నవారి డేటాను దీనికి అనుసంధానం చేసి, అనుమానితులను సులువుగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే తిరుమలకు వచ్చే వాహనాల సమాచారాన్ని పర్యవేక్షిస్తూ, కాలుష్య నియంత్రణకు పాత వాహనాలను నిలిపివేయనున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.16 కోట్లు ఖర్చు చేయగా, మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.30 కోట్లకు చేరుతుందని అంచనా. ఏడుగురు దాతలు ఈ కేంద్రం నిర్మాణానికి సహకారం అందించారు. ఏడాది పాటు దీని నిర్వహణ బాధ్యతలను కూడా వారే చూసుకోనున్నారు. మొత్తం మీద భక్తులకు ఈ ఆధునిక సాంకేతికతతో తిరుమలలో పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది.

Related posts

What Operational Excellence Really Means for Business Travel

Drukpadam

ప్రకాశం జిల్లాలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్ధులు గల్లంతు…

Ram Narayana

వివేకా హత్య కేసులో సాక్షి వాచ్ మన్ రంగన్న అనారోగ్యంతో మృతి!

Ram Narayana