జాతీయ వార్తలు

జడ్జికి లంచం పేరుతో రూ.50 లక్షలు.. న్యాయవర్గాల్లో కలకలం…

  • సీనియర్ న్యాయవాదిపై కేంద్ర న్యాయశాఖకు ఫిర్యాదు
  • కేసు విచారణ నుంచి తప్పుకున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి
  • మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశం
  • ఆరోపణలను ఖండించి, విచారణకు సిద్ధమన్న సదరు న్యాయవాది

తమకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తికి లంచం ఇవ్వాలంటూ ఓ సీనియర్ న్యాయవాది పిటిషనర్ల నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారనే ఆరోపణ తమిళనాడు న్యాయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు ‘ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్’ అనే సంస్థ కేంద్ర న్యాయశాఖకు ఫిర్యాదు చేసింది. న్యాయశాఖ ఈ ఫిర్యాదును మద్రాస్ హైకోర్టుకు పంపడంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

2008-09లో ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో ఇండియన్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్‌ను రూ.113.38 కోట్ల మేరకు మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ ప్రసాద్ అగర్వాల్, గణేశ్ అగర్వాల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. నిర్మల్ కుమార్ ధర్మాసనం ముందుకు వచ్చింది.

అయితే, ఈ కేసులో అనుకూల తీర్పు కోసం న్యాయమూర్తికి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ సీనియర్ న్యాయవాది మురళీకుమరన్ పిటిషనర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తన దృష్టికి రావడంతో జస్టిస్ నిర్మల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఆ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, ఈ లంచం ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. మరోవైపు, న్యాయవాది మురళీకుమరన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Related posts

ఈసారి చైనా వర్క్ కల్చర్‌ను తెరపైకి తెచ్చిన నారాయణ మూర్తి!

Ram Narayana

వాట్ ఏ ఐడియా…పులులు జనావాసాల్లోకి రాకుండా ఉండాలంటే మేకలను పంపాలి..మంత్రి

Ram Narayana

కర్ణాటకలో హైడ్రామా …సీఎం సీటుకోసం సిద్దరామయ్య …డీకే శివకుమార్ పట్టు…

Drukpadam