ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ…
పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని కోరిన మంత్రి తుమ్మల
తిరుమలలో తెలంగాణ రాష్టానికి 5 ఎకరాల స్థలం కేటాయింపుకు విజ్ఞప్తి
ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించండి
తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగుదాం
ఖమ్మం జిల్లా పెద్దవాగు మరమ్మత్తుల కోసం అయ్యే ఖర్చులో 85% నిధులను విడుదల చేయాలని మంత్రి అభ్యర్థన
సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేయండి
భద్రాచలం ముంపు బారిన పడకుండా నిర్మించిన కరకట్టకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భాగానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరిన మంత్రి తుమ్మల.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఖమ్మం జిల్లాకు సంబంధిచిన సాగునీటి వసతులు, భక్తులు మరియు ప్రజల సౌకర్యానికి సంబంధించిన పలు కీలక విజ్ఞప్తులు చేసారు.
రాష్ట్ర పునర్విభనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అయిదు గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు. యేటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటం వల్ల ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండటంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంక్లేవ్లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు దృష్టికి తుమ్మల తెచ్చారు ..