అంతర్జాతీయం

నేపాల్‌లో ఘోర ప్రమాదం: త్రిశూలి నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి!

  • పోఖారా నుంచి కాఠ్మండు వెళ్తుండగా ఘటన
  • అర్ధరాత్రి వేళ ప్రమాదం.. నుజ్జునుజ్జయిన బస్సు
  • 27 మందిని కాపాడిన సిబ్బంది
  • పొగమంచు లేదా డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసుల అనుమానం 

పొరుగు దేశమైన నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటక నగరం పోఖారా నుంచి రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి త్రిశూలి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ధాడింగ్ జిల్లాలోని పృథ్వీ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెనిఘాట్ రోరాంగ్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పైనుంచి సుమారు 300 మీటర్ల లోతులో ఉన్న నది ఒడ్డున పడిపోయింది. దీంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఈ ప్రమాదంలో మొత్తం 27 మందిని సురక్షితంగా కాపాడి, చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో 11 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రమాదానికి దట్టమైన పొగమంచు లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో బస్సు పూర్తిగా మునిగిపోకుండా ఒడ్డున పడటం వల్ల ప్రాణ నష్టం కొంతమేర తగ్గిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

నైజీరియాలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 21 మంది క్రీడాకారులు మృతి

Ram Narayana

సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన పాకిస్థాన్.. అసలు సిమ్లా ఒప్పందం అంటే ఏమిటి?

Ram Narayana

మెక్సికోలో భారీ గాలులకు కూలిన స్టేజ్.. ఐదుగురి మృతి..

Ram Narayana