- ఢిల్లీలో అరుణాచల్ ప్రదేశ్ యువతులపై జాత్యహంకార దాడి
- ఏసీ ఏర్పాటు దుమ్ముపై మొదలైన చిన్న వివాదం
- నీచమైన పదజాలంతో దూషించిన పొరుగింటి దంపతులు
- కేసు నమోదు చేసిన పోలీసులు..
- ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తీవ్ర ఆగ్రహం
దేశ రాజధాని ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై మరోసారి జాత్యహంకార దాడి జరిగింది. ఓ చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, తీవ్ర దూషణలకు దారితీసింది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో నివసిస్తున్న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు యువతులపై పొరుగింటి దంపతులు నీచమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ఫిబ్రవరి 20న నాలుగో అంతస్తులో ఉంటున్న యువతులు తమ ఇంట్లో ఏసీ బిగిస్తుండగా, గోడకు రంధ్రం చేసినప్పుడు వెలువడిన కొద్దిపాటి దుమ్ము కింద ఫ్లోర్లోని బాల్కనీలో పడింది. దీనిపై యువతులు వెంటనే క్షమాపణలు చెప్పినప్పటికీ, కింద ఫ్లోర్లో నివసించే హర్ష్ సింగ్, రూబీ జైన్ అనే దంపతులు తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో నిందితురాలు రూబీ జైన్.. “రూ. 500కు మసాజ్ పార్లర్లలో పనిచేసే వ్యభిచారులు” అంటూ యువతులను దారుణంగా దూషించారు. అంతటితో ఆగకుండా, “నా భర్తతో పడుకో” అంటూ అత్యంత నీచంగా మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చదువుకోరని, ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేసుకుంటారంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు వచ్చినప్పటికీ వారి ముందే నిందితులు దూషణలు కొనసాగించడం గమనార్హం. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 196 (జాతి ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టడం), సెక్షన్ 79 (మహిళల గౌరవానికి భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
ఈ దాడిపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తీవ్రంగా స్పందించారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై ఇలాంటి వివక్షాపూరిత దాడులను తక్షణమే అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.