అంతర్జాతీయం

దుబాయ్ మార్కెట్‌లో క్షిపణి శకలాల కలకలం.. తాము యుద్ధంలోనే ఉన్నామన్న యూఏఈ అధ్యక్షుడు!

  • ఇరాన్ ప్రయోగించిన 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్ల కూల్చివేత
  • దుబాయ్ మెరీనాలోని ఒక భవనంపై పడ్డ క్షిపణి శకలాలు
  • పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు
  • అమెరికా డిమాండ్‌ను తిరస్కరించిన టెహ్రాన్

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతంగా కమ్ముకున్నాయి. శనివారం ఇరాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులను యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. అయితే, కూల్చివేసిన ఒక క్షిపణి శకలాలు దుబాయ్ మెరీనాలోని ఒక ఎత్తైన భవనం (టవర్)పై పడటంతో స్వల్పంగా మంటలు చెలరేగి పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది.

యూఏఈ రక్షణ శాఖ వివరాల ప్రకారం.. ఇరాన్ మొత్తం 16 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా అందులో 15 క్షిపణులను గాలిలోనే కూల్చేశారు. ఒకటి సముద్రంలో పడిపోయింది. అలాగే 121 డ్రోన్లలో 119 డ్రోన్లను యూఏఈ బలగాలు ధ్వంసం చేశాయి. అబుదాబీ టీవీ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. “మనం ఇప్పుడు యుద్ధ కాలంలో ఉన్నాం.. ఈ సంక్షోభం నుంచి మరింత బలంగా బయటపడతాం” అని పేర్కొన్నారు.

మరోవైపు, పొరుగు దేశాలపై జరిగిన దాడులకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్ క్షమాపణలు చెప్పారు. “పొరుగు దేశాల నుంచి మాపై దాడులు జరిగితే తప్ప, మేము ఇతర దేశాలపై క్షిపణులు ప్రయోగించం” అని స్పష్టం చేశారు. అయితే, ‘షరతులు లేని లొంగుబాటు’ కావాలన్న డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ను ఆయన తీవ్రంగా తోసిపుచ్చారు. “ఇరాన్ ప్రజల లొంగుబాటు అనేది శత్రువులకు కలే.. ఆ కోరికను వారు సమాధి వరకు తీసుకెళ్లాల్సిందే” అని ఘాటుగా స్పందించారు.

ఇరాన్ అణు కార్యకలాపాలను పునఃప్రారంభించిందన్న కారణంతో ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Related posts

 ప్రతికూల వాతావరణం నేపథ్యంలో.. శంషాబాద్‌లో ఖతార్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Ram Narayana

కెనడాలో హిందూ దేవాలయం గేటుపై ఖలిస్థానీ పోస్టర్లు

Ram Narayana

నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజిలాండ్

Ram Narayana