లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో రాజుకున్న రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఆమె కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఇలా మాట్లాడుతున్నారని, కంగనాలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పలువురు విపక్ష నేతలు గురువారం తీవ్రంగా స్పందించారు.
పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రవర్తన మహిళలకు ఇబ్బందికరంగా ఉంటోందని, ఆయన తీరు ‘టపోరీ’లా ఉందని కంగనా బుధవారం ఆరోపించారు. తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను చూసి ఆయన హుందాతనం నేర్చుకోవాలని కూడా ఆమె సూచించారు. ఈ వ్యాఖ్యలే తాజా వివాదానికి దారితీశాయి.
కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ సుఖ్దేవ్ భగత్ స్పందిస్తూ, ఆమె మాజీ బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “ప్రధాని మోదీ, బీజేపీ దృష్టిలో పడేందుకే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. గాజు ప్యాలెస్లలో నివసించే వారు ఇతరులపై రాళ్లు వేయకూడదు” అని తెలిపారు.
పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ కూడా “కంగనాలాంటి వారిని పట్టించుకోవద్దు” అని కొట్టిపారేశారు. సినీ రంగంలో పనిచేసే కంగనా.. ఒక గౌరవనీయ నేత గురించి ఇలా మాట్లాడటం వింతగా ఉందని ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ ఫౌజియా ఖాన్ అన్నారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ మాట్లాడుతూ.. కంగనాను ఎవరూ సీరియస్గా తీసుకోరని, 2014లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పిన ఆమె మేధోస్థితిపైనే అనుమానాలున్నాయని ఎద్దేవా చేశారు.
మరోవైపు, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తన బాధ్యతను సీరియస్గా నిర్వర్తించడం లేదని బీజేపీ ఎదురుదాడికి దిగింది. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరావోగి మీడియాతో మాట్లాడుతూ.. “లోక్సభ లోపల, బయట రాహుల్ ప్రవర్తనలో సీరియస్నెస్ లేదు. యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కూడా ఆయన ప్రకటనలు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటున్నాయి” అని విమర్శించారు. రాహుల్ ప్రవర్తన కారణంగానే కాంగ్రెస్లో సీనియర్ నేతలు బీజేపీలో చేరుతున్నారని, రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.