దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. డేజియాన్ నగరంలోని ఒక ఆటో విడిభాగాల తయారీ కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మరణించగా, 59 మంది గాయపడ్డారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం తర్వాత ఫ్యాక్టరీ భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో అధికారులు రోబోలను రంగంలోకి దింపి, భవనాన్ని చల్లబరిచాక గాలింపు పనులు చేపట్టారు. ప్రమాద సమయంలో లోపల చిక్కుకుపోయిన మరో నలుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పైనుంచి దూకగా, మరికొందరు పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. సుమారు 500 మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది, ఫ్యాక్టరీలోని 100 కిలోల ప్రమాదకర రసాయనాలను సురక్షితంగా బయటకు తరలించారు. దీంతో మరో పెద్ద ముప్పు తప్పిందని అధికారులు వెల్లడించారు. అయితే, అసలు ప్రమాదానికి కారణం ఏమిటనే దానిపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.