అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసా విధానాలను కఠినతరం చేయడంతో చట్టబద్ధమైన వలసలు (లీగల్ ఇమ్మిగ్రేషన్) భారీగా పడిపోయాయి. 2025 మొదటి ఎనిమిది నెలల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించగా, ముఖ్యంగా భారత్, చైనా దేశాల వారు తీవ్రంగా నష్టపోయారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది.
అధికారిక గణాంకాల ప్రకారం 2024 జనవరి-ఆగస్టు కాలంతో పోలిస్తే 2025లో ఇదే సమయానికి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ సుమారు 2.5 లక్షల వీసాలను తక్కువగా జారీ చేసింది. శాశ్వత నివాసం (గ్రీన్ కార్డు), తాత్కాలిక వీసాల జారీలో మొత్తం 11 శాతం తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల విద్యార్థులు, ఉద్యోగులు, అమెరికా పౌరుల కుటుంబ సభ్యులకు ఇచ్చే వీసాలతో పాటు పర్యాటక వీసాలపై కూడా ప్రభావం చూపింది.
భారత్, చైనా దేశాల వారికి జారీ చేసే వీసాల్లో సుమారు 84,000 తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా విద్యార్థి వీసాలు 30 శాతానికి పైగా పడిపోగా, ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసాలు కూడా దాదాపు 30,000 తగ్గాయి. 19 దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలు, సోషల్ మీడియా ఖాతాల తనిఖీలతో కూడిన విస్తృత పరిశీలన, స్టేట్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత వంటివి ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని అధికారులు, విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ విషయంపై స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ.. “వీసా అనేది హక్కు కాదు, ఒక సౌలభ్యం మాత్రమే. అమెరికా పౌరుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఆంక్షలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ పోటీతత్వానికి నష్టం కలిగిస్తాయని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన జాసన్ ఫర్మన్ వంటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
u s lo bhariga padipoyina visa la jari ..manavallaku tappani ibbandulu ..